మేళ్లచెర్వు , ఫిబ్రవరి 6 : మేళ్లచెర్వు శంభులింగేశ్వరుడి క్షేత్రం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 8నుంచి 12 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇక్కడికి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలతోపాటు ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వేడుకలను ప్రశాంతంగా జరిపేందుకు వెయ్యి మంది సిబ్బంది, సీసీ కెమెరాలతో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
కోటి రూపాయలతో జాతర ఏర్పాట్లు
జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఎస్డీఎఫ్ నిధులను విడుదల చేసింది. దాంతో దక్షిణ రాజగోపురం నిర్మాణంతోపాటు భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రస్థా యి ఎద్దుల పందేలు, కబడ్డీ పోటీల నిర్వహణకు చేపట్టిన స్టేజీ, కోర్టు నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి.
జాతర కార్యక్రమాలు
ఈ నెల 8న తెల్లవారు జామున శివాలయంలో స్వామి కి అభిషేకాలతో జాతర మొదలు కానున్నది. అదే రోజు సాయంత్రం ప్రభల ఊరేగింపు, రాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తారు. 9న తెలుగు రాష్ర్టాల స్థాయి ఎద్దుల పందేలు, కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. 10న ఉదయం స్వామివారి రథోత్సవం, 11న రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, 12న రాత్రి పవళింపు సేవతో జాతర ముగియనుంది. అదేరోజు రాత్రి ఎద్దుల పందేలు, కబడ్డీ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తారు.