నల్లగొండ : సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదని, ఆయన పక్కా తెలంగాణ విరోధి అని నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. ఆయన కుమార్తె వైఎస్ షర్మిల నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేస్తూ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రావొద్దని కోరుకున్న వారిలో మొదటి స్థానంలో వైఎస్, ఆయన కుటుంబం ఉండేదని శనివారం నల్లగొండలో మీడియా సమావేశంలో దుయ్యబట్టారు.
రాజశేఖర్ రెడ్డి ఏదో గొప్ప అభివృద్ధి చేశాడని, రాజన్న రాజ్యంలోనే అభివృద్ధి జరిగిందంటూ వైఎస్ షర్మిల ఊకదంపు ఉపన్యాసాలతో ఊదరగొట్టడం తగదని బండా నరేందర్రెడ్డి చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని పణంగా పెట్టిన వైఎస్సార్.. రాయలసీమకు నిధులు దోచుకుపోయాడని ఆరోపించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికి ఆదర్శవంతంగా పాలన సాగుతున్నదన్నారు. కేసీఆర్ అభివృద్ధి, ప్రజలకు అందించే సంక్షేమ ఫలాలను యావత్ భారతదేశం పొగుడుతున్నదని గుర్తుచేశారు.
95 శాతం ఉద్యోగాలు స్థానికులకు రావాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి ఉద్యోగ నియామకాలపై కసరత్తు చేసారని, ఇది తెలియని వైఎస్ షర్మిల అడ్డగోలుగా మాట్లాడటాన్ని బట్టి ఆమెకు విషయ పరిజ్ఞానం లేదని తెలుస్తున్నదని విమర్శించారు. అసలు షర్మిలకు తెలంగాణకు ఏమిటి సంబంధం? ఇలాంటి వ్యక్తులను ఈ గడ్డపై ఇంకా తిరగనివ్వడమే ఇక్కడి ప్రజలు చేస్తున్న తప్పా..? అని ప్రశ్నించారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని ఆయన హితవుపలికారు. మీడియా సమావేశంలో టీఆరెస్ నేతలు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, అలంకుంట్ల మోహన్ కూడా పాల్గొన్నారు.