నల్లగొండ, డిసెంబర్ 27 : కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఐ ఏజీఎం అలీముద్దీన్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు భరోసా ఇస్తాయని తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాని మోదీ సంకల్పమని పేర్కొన్నారు.
అర్హులందరికీ పథకాలు అందించాలన్న ఉద్దేశంతోనే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, పీఎం కిసాన్, పీఎం అటల్ పెన్షన్ యోజన, ముద్ర యోజన తదితర పథకాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా 2024 నూతన సంవత్సర క్యాలెండర్తోపాటు ప్రభుత్వ పథకాలపై ప్రచురించిన బ్రోచర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్, జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వర్రావు, నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి వినయ్కుమార్, జిల్లా డిప్యూటీ వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ వేణుగోపాల్, మేనేజర్ మధు, మెప్మా ప్రాజెక్ట్ అధికారి కరుణాకర్, వికసిత్ భారత్ కో ఆర్డినేటర్లు శ్రీదేవిరెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.