నీలగిరి, మే 17 : మాతా, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఆరోగ్య లక్ష్మి పథకంతో లబ్ధిదారులకు దొడ్డు బియ్యం నుంచి విముక్తి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల మొదటివారం నుంచి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకూ సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. దీని ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షా 76 వేల 180 మందికి లబ్ధి చేకూరనున్నది. అంగన్వాడీ కేంద్రాల్లో చిరుతిళ్లు, పాలు, గుడ్డుతో పాటు బాలామృతం, ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలకు అలాగే గర్భిణులు, బాలింతలకు పోషకాలతో కూడిన భోజనాన్ని వడ్డిస్తున్నారు. దొడ్డు బియ్యం కావడం వల్ల చాలామంది భోజనం చేయడానికి రావడం లేదు. ఇటీవల నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇందుకోసం అయ్యే ఖర్చును మహిళా, శిశు సంక్షేమ శాఖ భరించేలా నిర్ణయించారు. ఒకో లబ్ధిదారుకు రూ.23.50 వరకు ఖర్చు చేసున్నారు. గ్రామీణులు పోషకాహార లోపం, రక్తహీనతలను అధిగమించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ప్రస్తుతం అంగన్వాడీల్లో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు రుచికరమైన భోజనం అందుతుంది. మధ్యాహ్న భోజనంతో పాటు ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు, 200 గ్రాముల పాలు అందిస్తున్నారు. మూడేళ్ల లోపు చిన్నారులకు బాలామృతం అందిస్తున్నారు. అంగన్వాడీల్లో భోజనం చేసే గర్భిణులు, బాలింతలు, ప్రీ స్కూల్ చిన్నారులకు మరింత ప్రయోజనం చేకూరేలా సర్కారు ఇక నుంచి సన్న బియ్యాన్ని అందించనున్నది.
‘ఆరోగ్యలక్ష్మి’కి ఖర్చు ఇలా..
అంగన్వాడీల్లో ఆరోగ్యలక్ష్మి పథకం నిర్వహణకు ప్రభుత్వం నిత్యం లక్షలాది రూపాయలను వెచ్చిస్తోంది. మాతా, శిశువులకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 జనవరి నుంచి ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కో గర్బిణి, బాలింతకు రోజూ రూ.21.50 వెచ్చిస్తోంది. 150 గ్రాముల బియ్యానికి రూ.6, పప్పు 30 గ్రాములకు రూ.2.55, నూనె 16 గ్రాములకు రూ.1.10, పాలు 200 మీల్లీలీటర్లకు రూ.9.85, కోడిగుడ్డుకు రూ.4.20, కూరగాయలు 50 గ్రాములకు రూ.1.5, ఇతర ఖర్చులకు మరో రూ.6 చొప్పున వెచ్చిస్తుంది. 3 నుంచి 6 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు రోజుకు రూ.7.26 చొప్పన, 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు రోజుకు రూ.7.12 చొప్పున వెచ్చిస్తుంది.
ఉమ్మడి జిల్లాలో 1,76,180 మందికి ప్రయోజనం..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 4,203 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 1,76,180 మందికి లబ్ధి చేకూరనున్నది. వీరిలో 21,767 మంది గర్బిణులు, 20,653 బాలింతలు, 83,889 మంది ఆరు నెలల నుంచి 3 సంవత్సరాల లోపు వారు 3 నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 49,871 మంది ఉన్నారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అంగన్వాడీ కేంద్రం పరిధిలోని ప్రభుత్వ టీచర్, సర్పంచ్/ వార్డు కౌన్సిలర్, ఆవాస ప్రాంత పెద్దలు, పిల్లల తల్లిదండ్రులతో కూడిన కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది.
బియ్యం నేరుగా కేంద్రాలకే..
ఆరోగ్య లక్ష్మి పథకం కింద సన్న బియ్యంతో కూడిన భోజనం అందించేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు. నెలాఖరులోగా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు గోదాముల నుంచి బియ్యం అందిస్తారు. రక్తహీనతను అధిగమించేందుకు బలవర్ధక ఆహారం మిలితం చేసి సంపూర్ణ మధ్యాహ్న భోజనం అందించనున్నాం. ఈ అవకాశాన్ని గర్బిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలి.
– కె.కృష్ణవేణి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి, నల్లగొండ