బొడ్రాయిబజార్, మార్చి 20 : పరిశుభ్రతలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన సూర్యాపేట మున్సిపాలిటీ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే చెత్తను ఎరువుగా మార్చడం, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకలు, టైల్స్ తయారు చేసి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. ఇక వ్యర్ధం ఉన్న మలాన్ని సైతం ఎరువుగా మార్చేందుకు ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ను ఏర్పాటు చేసింది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇమాంపేటలో మున్సిపాలిటీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి) సంయుక్త ఆధ్వర్యంలో ఎకరం స్థలంలో రూ. 2కోట్ల వ్యయంతో పారిశుధ్య వనరుల ఉద్యాన వనాన్ని ఏర్పాటు చేసింది. దాంతో పాటు మలాన్ని ఎరువుగా మార్చేందుకు 35 కేఎల్డీ(కిలో లీటర్స్ ఫర్ డే) సామర్థ్యం కలిగిన వ్యర్థాల ప్లాంట్ను(ఎఫ్ఎస్టీపీ) కూడా ఏర్పాటు చేసింది. ఇందులో పనులు ఇప్పటికే పూర్తి చేయడంతో పాటు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రస్తుతం ప్లాంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
వ్యర్థాల శుద్ధి
శానిటేషన్ రిసోర్స్ పార్క్లోని ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ 24 గంటల్లో వ్యర్థాన్ని శుద్ధి చేస్తుంది. ట్యాంకర్ల ద్వారా సేకరించిన మల వ్యర్థాలను ప్లాంట్కు తరలించి వేయింగ్ మిషన్ ద్వారా బరువు అంచనా వేస్తారు. దానిని ప్లాంట్ వద్ద ఉన్న ఫిల్టర్ చేసే ట్యాంక్లో అన్లోడ్ చేస్తారు. ఫిల్టర్ ట్యాంక్ నుంచి మల వ్యర్థాలను వేరు చేసే యంత్రాల ద్వారా నీటిని ఒక చోట, వ్యర్థాన్ని మరోచోట చేరుస్తుంది. మలాన్ని ఒక వైపునకు, నీటినీ మరో వైపునకు పంపించి బయటికి తరలిస్తారు. ఇందులో శుద్ధి చేసిన నీటిని చెట్లు, రోడ్లు, వ్యవసాయ సాగు, పంటలు, ఆకుకూరలు, కూరగాయలు, భవన నిర్మాణ పనులకు ఉపయోగిస్తారు. వ్యర్థాలను ఎరువుగా మార్చి మొక్కలు, వ్యవసాయ పంటకు వినియోగిస్తారు. 50 కిలోల మానవ వ్యర్థాల నుంచి 7 నుంచి 8 కిలోల బయోచర్(ఎరువు) ఉత్పత్తి కానుంది.
సెప్టిక్ ట్యాంక్ నిండితే ఇక చింత వద్దు
సూర్యాపేట జిల్లా కేంద్రం ఇప్పటికే బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణంగా పేరు పొందింది. ప్రస్తుతం పట్టణ జనాభా పెరుగుతుండడంతో ఇండ్ల సంఖ్య కూడా పెరిగింది. దాంతో ఒకే ఇంట్లో 2 నుంచి 3 మరుగుదొడ్లు ఉండగా సెప్టిక్ ట్యాంక్ త్వరగా నిండుతోంది. మాములుగా సెప్టిక్ ట్యాంక్ కలిగి ఉన్న వారు మూడు నెలలకు ఒకసారి దానిని క్లీన్ చేయించాల్సి ఉండగా ఏండ్లు గడిచినా శుభ్రం చేయక పోవడంతో పూర్తిగా నిండిన తరువాత సెప్టిక్ క్లీన్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సెప్టెక్ ట్యాంక్ సేకరించిన మలాన్ని ఊరికి దూరంగా పోయడంతో చుట్టు పక్కల ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంలో శానిటేషన రిసోర్స్ పార్క్ ఏర్పాటు చేయడంతో సెప్టిక్ ట్యాంకుల ద్వారా సేకరించిన మలాన్ని ప్లాంట్కు తరలించి శుద్ధి చేసి ఎరువుగా మార్చనున్నారు. దాంతో ఇండ్లలోని సెప్టిక్ ట్యాంక్ నిండితే బాధపడాల్సిన పని లేకుండా పోతుంది.
ప్రజల సౌకర్యార్థమే ఎఫ్ఎస్టీపీ
పట్టణ ప్రజల సౌకర్యార్థమే ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ను ఏర్పాటు చేశాం. పట్టణ ప్రజలు తమ ఇండ్లల్లో సెప్టిక్ ట్యాంక్లు నిండితే సెప్టిక్ ట్యాంకర్లలో తరలించి రోడ్ల వెంట పోస్తున్నారు. దాంతో దుర్వాసన వస్తుందంటూ అక్కడి ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ఎఫ్ఎస్టీపీ ప్రారంభమైతే ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి. ఇండ్లలోని సెప్టిక్ ట్యాంకుల్లోని మలాన్ని ఎఫ్ఎస్టీపీ ప్లాంట్కు తరలించి, ఎరువుగా మారుస్తారు.
– పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ చైర్పర్సన్, సూర్యాపేట
త్వరలో ప్రారంభిస్తాం
సూర్యాపేట పట్టణ ప్రజల సౌకర్యార్థం ఇమాంపేట సమీపంలో రూ. 2 కోట్లతో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే ట్రయల్న్ పూర్తి చేశాం. త్వరలో ప్రారంభించనున్నాము. పట్టణంలోని సెప్టిక్ ట్యాంకుల ద్వారా మలాన్ని సేకరించి ఈ ప్లాంట్లో ఎరువుగా మారుస్తారు. పట్టణ ప్రజలు మల వ్యర్థాలను బయట పారబోయకుండా ప్లాంట్కు మాత్రమే తరలించాలి. లేని పక్షంలో చర్యలు తప్పవు.
– రామానుజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట