కోదాడ, జూలై 26 : కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత తమలపాకుల సైదులును నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డు వరించింది. శనివారం హైదరాబాద్లో జరిగిన త్యాగరాయ గాన సభ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, విశ్రాంత న్యాయమూర్తి మధుసూదన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. గతంలో సూక్ష్మ కళారూపాలు 501 బియ్యపు గింజలపై ఎనిమిది భాషల జాతీయ గీతం రాయడం జరిగిందని, 13 మిల్లీల చెస్ బోర్డు విత్ కాయిన్స్ వంటి ఎన్నో కళారూపాలు తాను తయారు చేసినందుకు గుర్తింపుగా తనకు అవార్డు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా సైదులు పేర్కొన్నారు. సైదులకు అవార్డు రావడం పట్ల కోదాడ పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.