– ప్రమాదం జరిగేంతవరకు పట్టించుకోరా?
– అధికారులను ప్రశ్నిస్తున్న గొల్లగూడెం రైతులు
నకిరేకల్, మే 27 : నకిరేకల్ మండలంలో వరి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పలు గ్రామాలలోని వరి పొలాల్లో విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయి. కొన్నిచోట్ల విద్యుత్ తీగలు చేతికి అందుకుంటే తాకేంత కిందకు సాగి ఉన్నాయి. సాగుకాలం కావడంతో రైతులు ట్రాక్టర్లతో పొలం దున్నేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి లేకపోలేదు. నకిరేకల్ మండలం గొల్లగూడెం గ్రామ శివారులో చిరబోయిన యాదయ్య అనే రైతు పొలంలో ఇటీవల వీచిన ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు చేతికి అందే స్థాయిలో వేలాడుతున్నాయి. సంబంధిత విద్యుత్ సిబ్బందిని సంప్రదిస్తే తమ పరిధి కాదని, అవి మేము సరి చేయమని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని రైతు ఆరోపించారు. విద్యుత్ వైర్లు ఇలా పొలాల్లో వేలాడితే ఎలా సాగు చేయాలని, ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా అని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈదురు గాలులకు సాగిన విద్యుత్ వైర్లను సరిచేయాలని, అవసరమున్న చోట మధ్య మధ్యలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, ప్రమాదం జరగకముందే ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను రైతులు వేడుకుంటున్నారు.
సమస్య పరిష్కరించకపోతే కలెక్టర్కు ఫిర్యాదు : ముక్కామల శ్రీనివాస్, బీఆర్ ఎస్ నాయకుడు, గొల్లగూడెం
గొల్లగూడెం, చందంపల్లి, బొల్లారం, నెల్లిబండ శివారులో ఇటీవల వీచిన ఈదురు గాలులకు పొలాల్లో విద్యుత్ వైర్లు సాగి రైతులకు తగిలేలా వేలాడుతున్నాయి. ప్రమాదం జరగక ముందే విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమై రైతులను రక్షించాలి. ట్రాక్టర్లతో సాగు చేసే సమయంలో రైతులకు, ట్రాక్టర్లకు విద్యుత్ వైర్లు తగిలే ప్రమాదం ఉంది. విద్యుత్ ఏఈ వెంటనే స్పందించి మధ్య మధ్యలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో విద్యుత్ వైర్ల సమస్యలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం.

విద్యుత్ వైర్లు ఇలా.. సాగు చేసేదెలా ?