ఏ కారణంతోనైనా రైతు చనిపోతే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో వీధిన పడొద్దనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపట్టింది. నాలుగేండ్లుగా అమలు చేస్తున్న ఈ ఉచిత బీమాను ప్రభుత్వం మరో ఏడాది రెన్యువల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో దరఖాస్తు చేసుకోనివారు, కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారు అప్లికేషన్ పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1నాటికి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఆ గడువును 13వ తేదీకి పొడిగించింది. దాంతో జిల్లా వ్యాప్తంగా 16వేల మంది కొత్తగా పొందిన పట్టాదారు పాసు పుస్తకాలతో దరఖాస్తు చేసుకొని ఉచిత రైతు బీమాకు అర్హత పొందారు. ఎల్ఐసీతో ప్రభుత్వం కుదుర్చుకున్న బీమా గడువు ఈ నెల 13తో పూర్తి కాగా.. దాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నాలుగేండ్లలో మృతిచెందిన 5,377 మంది రైతుల కుటుంబాలకు ఈ పథకం కింద క్లెయిమ్ ఇప్పించి ఆర్థిక భరోసా కల్పించారు.
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రూ.ఐదు లక్షల బీమాను నాలుగేండ్లుగా అమలు చేస్తున్నది. ఈ స్కీమ్ ప్రతి ఏడాది ఆగస్టు 13తో పూర్తవుతుండగా.. ప్రతిఏటా పాలసీని పొడిగిస్తున్నది. గతంలో ఈ బీమాకు దరఖాస్తు చేసుకోనివారు, ఈ ఏడాది కొత్తగా భూములు కొన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం గత నెలలో సూచించి ఈ నెల 1వరకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఈ నెల 13వరకు పొడిగించింది. ఈ ఏడాది జూన్ 22నాటికి కొత్తగా పట్టా పొందినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దాంతో నల్లగొండ జిల్లాలో 16వేల మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏదాది నుంచి వారికి ఉచిత బీమా పథకం వర్తించనుంది.
మరో 16,048 మందికి ఉచిత బీమా వర్తింపు..
రైతు బీమా పథకానికి ఈ ఏడాది నల్లగొండ జిల్లాలో మరో 16,048 మంది రైతులు అర్హత సాధించారు. వారందరికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించనుంది. ఏ కారణంతోనైనా మరణిస్తే.. ఆ రైతు కుటుంబానికి ఎల్ఐసీ ద్వారా రూ.ఐదు లక్షల ఇన్సూరెన్స్ అందుతుంది. జిల్లా వ్యాప్తంగా 5.08లక్షల మంది రైతులు ఉండగా.. ఇప్పటి వరకు 2.81లక్షల మంది రైతులకు వ్యవసాయ శాఖ ఎల్ఐసీ బాండ్లు ఇచ్చింది. 18 నుంచి 59 ఏండ్ల వయసున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 1వరకు 13,510 దరఖాస్తులు రాగా.. అందులో 12,500 మంది అర్హత సాధించారు. ఈ నెల 13వరకు గడువు ఇవ్వగా.. మొత్తం 16,048మంది రైతు బీమాకు అర్హత సాధించారు.
ఉచిత బీమా కోసం పెరుగుతున్న గిఫ్ట్ డీడ్స్..
గుంట జాగా ఉన్న రైతులకు కూడా ప్రభుత్వం రైతు బీమా వర్తింపజేస్తున్నది. 18 ఏండ్ల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగినవారు చనిపోతే ప్రభుత్వం ఎల్ఐసీకీ చెల్లించిన ప్రీమియం ఆధారంగా వారం రోజుల్లోనే రూ.ఐదు లక్షలు అందుతున్నాయి. దీంతో గిఫ్ట్ డీడ్ పట్టాలు పెరుగుతున్నాయి. రైతులు తమకున్న భూమిలోనే భార్య, కుమారులు, కూతుళ్లు, కోడళ్లు, మనువండ్లు, మనుమరాండ్ల పేర ఎంతో కొంత రిజిస్ట్రేషన్ చేసి ఉచిత బీమాకు దరఖాస్తు చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సేల్ డీడ్ చేస్తే ఎక్కువ డబ్బు అవుతుండటంతో గిఫ్ట్ డీడ్ చేస్తున్నట్లు రెవెన్యూ యంత్రాంగం పేర్కొంటున్నది. ప్రతి ఏటా పెరుగుతున్న దరఖాస్తుల్లో 60శాతం ఈ తరహా రిజిస్ట్రేషన్లే జరుగుతుండగా.. ఈ ఏడాది అంతే స్థాయిలో కొత్త దరఖాస్తులు ఉన్నట్లు వ్యవసాయ శాఖ యంత్రాంగం అంటున్నది.
నాలుగేండ్లలో 5,377 మందికి క్లెయిమ్..
రైతులు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబంలోని నామినీ ఖాతాలో వారంలోపే రైతు బీమా డబ్బు జమ అవుతుంది. గత నాలుగేండ్లలో 5,377 మంది రైతులు మృతిచెందగా.. వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున రూ.268.85 కోట్ల క్లెయిమ్లు చేశారు. అయితే.. ఈ ఏడాది కొత్తగా పెరిగిన 16,048 మందితో కలిపి మొత్తంగా ఈ పథకం పరిధిలోకి 2.97లక్షల మంది రైతులు రానున్నారు.
కొత్తగా 16వేల మందికి రైతు బీమా..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు బీమా పథకం కోసం కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులను తొలుత ఆగస్టు 1నాటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. మొత్తంగా 13,510 మంది దరఖాస్తు చేసుకోగా.. ఆ వివరాలను కమిషనరేట్కు పంపించాం. వయసు కారణంగా 1010 దరఖాస్తులను తొలగించారు. 12,500 మందిని అర్హులుగా గుర్తించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 13వరకు దరఖాస్తులు తీసుకోగా మరికొంత మంది పెరిగి ఈ ఏడాది కొత్త లబ్ధిదారుల సంఖ్య 16,048కి చేరుకుంది. వారందరికీ త్వరలో కొత్త బాండ్లు ఇవ్వనున్నాం
– వై.సుచరిత, జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ