వానకాలం పంటల సాగుకు సంబంధించి రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాలో జమ అవుతున్నాయి. శనివారం ఐదెకరాల్లోపు రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 8.64 లక్షల మంది రైతులు 705.48 కోట్ల రూపాయలను పొందారు.
– నల్లగొండ ప్రతినిధి, జూలై 1 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, జూలై 1(నమస్తే తెలంగాణ) : రైతుబంధు డబ్బులు శనివారం ఐదు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.64 లక్షల మంది రైతులకు 705.48 కోట్ల రూపాయలు అందాయి. తొలిరోజు ఎకరం లోపు రైతులతో మొదలైన పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఐదు ఎకరాల్లోపు రైతులకు అందింది. శనివారం ఒక్క రోజే ఉమ్మడి జిల్లాలో మొత్తం 18,515 మంది రైతులకు రూ.32.42 కోట్లు జమ కాగా, అందులో నల్లగొండ జిల్లాలో 9,729 మంది రైతులకు రూ.16.28 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 4,186 మంది రైతులకు రూ.7.86 కోట్లు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 4,600 మంది రైతులకు రూ.8.28 కోట్ల రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటివరకు మొత్తం నల్లగొండ జిల్లాలో 4,23,509 మంది రైతులకు రూ. 352.78 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,37,655 మంది రైతులకు రూ.191.40 కోట్లు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 2,03,641 మంది రైతులకు రూ.161.29 కోట్లు పెట్టుబడి సాయంగా నగదు జమ అయ్యింది. ఇలా పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు వానకాలం సీజన్లో పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.