నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కరీంనగర్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్ రానున్నారు. సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కూడా బదిలీ కాగా ఆయన స్థానంలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న సీహెచ్ ప్రియాంక విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఆర్వీ కర్ణన్, సీహెచ్ ప్రియాంక దంపతులు. వీరు గతంలో ఖమ్మం జిల్లాలోనూ పనిచేశారు.
నల్లగొండ ప్రతినిధి, జూలై 25(నమస్తే తెలంగాణ) : నల్లగొండ కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కరీంనగర్ కలెక్టర్గా పని చేస్తున్న 2012 బ్యాచ్కి చెందిన ఆర్వీ కర్ణన్ నూతన్ కలెక్టర్గా నియామకమయ్యారు. సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగానే కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డికి స్థానచలనం కలిగినట్లు తెలుస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల ముందు సూర్యాపేట నుంచి నల్లగొండ కలెక్టర్గా వినయ్క్రిష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టు 10న జిల్లా కలెక్టర్గా వచ్చిన వినయ్క్రిష్ణారెడ్డి మునుగోడు ఉప ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారన్న పేరు ఉన్నది. దాంతోపాటు జిల్లాలో రెవెన్యూ పరంగా సమస్యల పరిష్కారంలో తన మార్క్ చూపించారు.
ముఖ్యంగా పోడు భూముల లబ్ధిదారుల ఎంపికలో ప్రతి దరఖాస్తునూ పరిశీలించి వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా చూశారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది అంటే 2,925 మందికి పట్టాలు అందాయి. ఇక ధరణి స్లాట్కి వచ్చే దరఖాస్తులను కూడా క్లియర్ చేయడంలో తనదైన శైలిని ప్రదర్శించారు. ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలులోనూ తన కృషి కొనసాగించారు. ప్రస్తుతం వినయ్క్రిష్ణారెడ్డిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. నల్లగొండకు ముందు వినయ్కృష్ణారెడ్డి సూర్యాపేట కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.