జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను చూసినా వాళ్లు బతుకు పోరాటంలో మాత్రం ఎన్నడూ అలిసిపోలేదు. కలోగంజో తాగి రెక్కల కష్టం మీద కుటుంబాలను నెట్టుకుంటూ వచ్చారు. పిల్లలను చదివించుకున్నారు.. పెండ్లిండ్లు చేసి బాధ్యత తీర్చుకున్నారు. ఇప్పుడు ఏడు పదుల వయస్సులోనూ ఇతరులపై ఆధారపడకుండా శ్రమనే నమ్ముకుని బతుకుతున్న వారిపైకి ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నుంచి మోతె మండలానికి మిర్చి కూళ్లకు వెళ్తున్న కూలీల ఆటోను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు.
– మునగాల, ఫిబ్రవరి 28
మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన రెమిడాల సౌభాగ్యమ్మ (75), కందుల గురువయ్య (70), రామసముద్రం గ్రామానికి చెందిన చెవుల నారాయణమ్మ (56), కందుల నాగమ్మ (65), రేపాల గ్రామానికి చెందిన పోకల అనసూయమ్మ (65) మోతె మండలంలోని పలు గ్రామాల్లో మిరపకాయలు ఏరేందుకు కొన్ని రోజుల నుంచి ఆటోలో వెళ్లి వస్తున్నారు. రోజు మాదిరిగా బుధవారం ఆటోలో వెళ్తుండగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వెంట మోతె మండలంలోని కేశవాపురం అండర్ పాస్ బ్రిడ్జి వద్ద ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మధిర డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణమ్మ, నాగమ్మ, సౌభాగ్యమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో అనసూర్య కూడా మరణించింది. గురువయ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ఆయన అక్కడ మృతిచెందాడు. మరో కూలీ లక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రమాద సమయంలో ఆటోలో 12మంది కూలీలు ఉండగా.. ఆరుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ విజయరాఘవాపురం గ్రామానికి వెళ్లి బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుకున్నారు.
విజయరాఘవాపురం గ్రామానికి చెందిన చెవుల నారాయణమ్మ కడు బీదరాలు. ఆమెకు పిల్లలు లేరు. భర్త మరణించగా ఒంటరిగా జీవిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బుతో జీవిస్తుంది. ఖర్చుల కోసం కూలినాలి పనులకు వెళ్తుంది. రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు.
విజయరాఘవాపురం గ్రామానికి చెందిన రెమిడాల సౌభాగ్యమ్మ (75) ముగ్గురు కూతుర్లకు పెళ్లిళ్లు చేసి జీవన పో రాటంలో నిలిచింది. చరమాంకంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఆమె రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది.
రోడ్డు ప్రమాదంలో విజయరాఘవాపురం గ్రామానికి చెందిన కందుల నాగమ్మ (65), గురువయ్య(70) దంపతులు మృతిచెందగా.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నాగమ్మ సంఘటనా స్థలంలో మృతిచెందగా.. గురువయ్య హైదరాబాద్ దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.