నల్లగొండ : మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి వల్లనే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అదనపు ఎస్పీ నర్మద అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. ఖాకీ చొక్కా విధిగా ధరించడంతో పాటు లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదాలకు కారణం కావద్దని ఆమె ఆటో డ్రైవర్లకు సూచించారు.
ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో సత్ప్రవర్తనతో మెలుగాలని, ప్రమాదాల నివారణకు సహకరిస్తూ ప్రమాదరహిత నల్లగొండగా తీర్చిదిద్దాలని ఆమె కోరారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపవద్దని సూచించారు.
కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ చీర్ల శ్రీనివాస్, డీటీఆర్బ్ ఎస్పీఓ అంజయ్య, ఎస్.ఐ. జయానందం, ట్రాఫిక్ ఏ.ఎస్.ఐ.లు తూడి సుధాకర్, జహంగీర్, సిబ్బంది మహేందర్, వేంకటేశ్వర్లు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.