నకిరేకల్, డిసెంబర్ 12 : నర్సింగ్ కళాశాల బస్సును లారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. దాంతో 13 మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణ శివారులో జాతీయ రహదారి 65పై సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మగడ్డలో ఉన్న అపర్ణ నర్సింగ్ కళాశాలలో జీఎన్ఎం మొదటి సంవత్సరం చదువుతున్న 32 మంది విద్యార్థినులు ఉదయం 7.30 సమయంలో సూర్యాపేట నుంచి కాలేజీ బస్సులో నల్లగొండలో మొదటి సంవత్సరం పరీక్షలు రాసేందుకు బయల్దేరారు. సుమారు 8 గంటల ప్రాంతంలో నకిరేకల్ శివారులో తాటికల్ ఫ్లైఓవర్ నుంచి నల్లగొండ వైపునకు బస్సు మళ్లుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న లారీ అతివేగంగా వెళ్తూ బస్సును వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. దాంతో బస్సు రోడ్డుపై బోల్తా పడింది. బస్సులోనున్న 13 మందికి విద్యార్థులకు తీవ్రంగా, మిగిలిన 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ సుదర్శన్తో పాటు విద్యార్థినులు తేజ, మదాని, మమత, స్వాతి, సరిత, గురుస్వామి, వెంకటేశ్, రాంచందర్, ఇందు, ఎస్కే వహీదా, స్వాతి, టి.హరిత, షర్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ రంగారెడ్డి స్థానికుల సాయంతో క్షతగాత్రులను అంబులెన్స్లో మొదటగా నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. 13 మంది విద్యార్థినులకు మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవర్ శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
విద్యార్థినులకు మెరుగైన చికిత్స
సూర్యాపేట : నకిరేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నర్సింగ్ విద్యార్థినులకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. 13 మందికి చిన్న చిన్న గాయాలు కాగా ఇద్దరికి మాత్రం చేతులు విరిగాయి. వీరికి డాక్టర్లు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స అందింస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెట్ మురళీధర్రెడ్డి తెలిపారు.
ప్రమాదంపై స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
నర్సింగ్కళాశాల విద్యార్థినులు ప్రమాదానికి గురైన ఘటనపై ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పందించారు. నకిరేకల్, సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యాధికారులు మంత్రికి వివరించారు. గాయపడ్డ విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ను మంత్రి ఆదేశించారు.