దామరచర్ల రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన రైల్వే స్టేషన్ను ప్రయాణికులు ఎక్కడం లేదని ఎత్తేశారు. దాంతో స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరి కూలిపోయింది. రైల్వే క్వార్టర్లు నిరుపయోగంగా మారాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంతో దామరచర్ల ఎంతో మారింది. సిమెంట్, పలు రకాల పరిశ్రమలతో వేలాది మందికి ఉపాధి కేంద్రంగా నిలిచింది. పవర్ ప్లాంట్ కోసం బొగ్గు రవాణాకు కొత్తగా రైల్వే లైన్లు నిర్మిస్తున్నారు. ప్రజల అవసరాల కోసం ఈ రైల్వే స్టేషన్ ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రైల్వే అధికారులు పాత స్టేషన్ను పరిశీలించి వివరాలు సేకరించారు. త్వరలోరైల్వే శాఖకు నివేదికను పంపి ఆ మేరకు చర్యలు తీసుకోనున్నారు.
దామరచర్ల, జూలై 2 : దామరచర్ల రైల్వేస్టేషన్ను పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇటీవల అధికారులు రైల్వే స్టేషన్ను పరిశీలించి దాని స్థితి గతులను తెలుసుకొన్నారు. మూడు దశాబ్ద్దాల క్రితం ఏర్పాటు చేసిన దామరచర్ల రైల్వే స్టేషన్ నాడు పరిసర గ్రామాలకు అనుకూలంగా, అందుబాటులో ఉండేది. నడికుడి నుంచి బీబీనగర్ వరకు ఉన్న స్టేషన్లలో దామరచర్ల ఒక్కటే బస్టాండ్, నార్కట్పల్లి-అద్దంకి హైవేకు పక్కనే ఉంది. దాంతో ప్రయాణికులు రైలు దిగి ఇంటికి చేరుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. మిర్యాలగూడ, దాచేపల్లి వెళ్లే ప్రయాణికులు కూడా దామరచర్లలో దిగి బస్సు ఎక్కి వెళ్లేవారు. కానీ ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు స్టేషన్ను ఎత్తివేశారు.
ప్రయాణికులు ఎక్కడం లేదని..
దామరచర్ల రైల్వేస్టేషన్లో గతంలో రేపల్లే రైలు ఆపేవారు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు దామరచర్ల మీదుగా అధికంగా ప్రయాణించేవారు. స్టేషన్లో టికెట్ వెండర్ను ప్రైవేటు ప్రాతిపదికన నియమించి కమీషన్ మీద టెక్కెట్లు అమ్మేలా ఏర్పాటు చేశారు. అయితే టికెట్ వెండర్ స్టేషన్కు వచ్చి టికెట్లు అమ్మిన పాపాన పోలేదు. నిత్యం అధికంగా ప్రయాణికులు స్టేషన్లో రైలు ఎక్కేవారు. కానీ టికెట్లు ఇక్కడ తీసుకోక పోవడంతో దామరచర్ల స్టేషన్లో అసలు ప్రయాణికులు ఎక్కడం లేదంటూ రైల్వే అధికార్లు స్టేషన్ను ఎత్తివేశారు. ఆ తర్వాత ప్రయాణికులు లేక పట్టించుకొనే వారు కరువై స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరింది. దాంతో అధికారులు భవనాన్ని కూలగొట్టారు. రైల్వే క్వార్టర్లు సైతం శిథిలమయ్యాయి. వాటి తలుపులు, కిటికీలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.
యాదాద్రి పవర్ప్లాంట్ ఏర్పాటుతో..
మండలంలోని వీర్లపాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పవర్ప్లాంట్ నిర్మిస్తున్నది. ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తికి నిత్యం 14 వ్యాగిన్ల బొగ్గు అవసరమై ఉంటుంది. దాంతో అందుకు అనుగుణంగా అదనంగా రైల్లే లైన్లు నిర్మిస్తున్నారు. సింగరేణి, కృష్ణపట్నం నుంచి బొగ్గు దిగుమతి చేసుకొనే విధంగా కొత్త రైల్వే ట్రాక్లు వేస్తున్నారు. దాంతో పాటు విష్ణుపురం స్టేషన్కు సంబంధం లేకుండా పలు పరిశ్రమలు ఎగుమతి, దిగుమతులకు ప్రత్యేకంగా జాన్పహాడ్, దామరచర్లకు బైపాస్ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అందుకు అవసరమైన సర్వే కూడా చేపట్టారు. ఈ లైన్ల నిర్మాణంతో దామరచర్ల రైల్వే స్టేషన్కు పునర్వైభం రానుంది. నిత్యం బొగ్గు రవాణా ఉంటుంది కాబట్టి రైల్వే శాఖకు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకు అనుగుణంగా స్టేషన్ను తీర్చిదిద్దే అవకాశం కూడా ఉంది.
సీఎం కేసీఆర్కు విన్నపంతో పనుల్లో కదలిక
ఇటీవల యాదాద్రి పవర్ప్లాంట్ పరిశీలనకు విచ్చేసిన సీఎం కేసీఆర్ను స్థానిక బీఆర్ఎస్ నాయకులు కలిసి దామరచర్ల రైల్వే స్టేషన్ను పునరుద్ధరించాలని వినతిపత్రం అందించారు. దాంతో దామరచర్లలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలనీ కోరుతూ సీఎంవో కార్యాలయం కేంద్ర రైల్వేశాఖకు లేఖ పంపించింది. ఫలితంగా రైల్వేశాఖ అధికారులు దామరచర్ల స్టేషన్ను పరిశీలించారు. పూర్తిస్థాయిలో వివరాలను సేకరించారు. త్వరలోనే నివేదికను రైల్వే ఉన్నతాధికారులకు పంపించి తదుపరి చర్యలు తీసుకొంటామని అధికారులు తెలిపారు.