వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ పీసీసీ అధ్యక్షుడి అక్కసు 8గంటలు ఇస్తే సరిపోతుందంటూ బుకాయింపు ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ వైఖరి తేటతెల్లం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతాంగం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనం కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అంటూ మండిపాటు రైతువేదికల వద్ద ఆందోళనలకు సన్నద్ధం నేడు మండల కేంద్రాల్లో నిరసనలు రేపు నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో… రైతుల శత్రువు కాంగ్రెస్ పార్టీ : మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
“ఎకరం పొలానికి నీరు పారించాలంటే ఒక్క గంట కరంటు చాలు. మూడు ఎకరాలు పారించాలనుకుంటే 3 గంటలు ఇస్తే సరిపోతుంది. మొత్తంగా రైతులకు 8 గంటలు విద్యుత్ ఎక్కువ. ఉచితం అనేది అనుచితం”
-వ్యవసాయానికి సీఎం కేసీఆర్ అందిస్తున్న
నిరంతర ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఉమ్మడి రాష్ట్రంలోని కరంటు కష్టాలు, అర్ధరాత్రి పాముకాటు చావులను దాటుకుని వచ్చిన రైతాంగం ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంటే కాంగ్రెస్ పార్టీకి కడుపు మండుతున్నట్టున్నది. అందుకే వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు సాధించిన నిరంతర ఉచిత విద్యుత్పై కత్తి గడుతున్నది. సాగుకు 24గంటల కరంట్ అవసరం లేదు, అదీ ఉచితంగా ఇవ్వాల్సిన పని లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ వైఖరిని తేటతెల్లం చేసింది. నిన్నమొన్నటి వరకూ భూ యాజమాన్య హక్కుల విషయంలో అత్యంత పకడ్బందీగా రూపొందించిన ధరణి పోర్టల్ను సైతం రద్దు చేస్తామంటూ గొంతు చించుకున్న రేవంత్.. ఇప్పుడు ఉచిత విద్యుత్పై పడడం మీద రైతులు భగ్గుమంటున్నారు. అమెరికా పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోడ్డెక్కి, రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. 9గంటల కరంటు అని చెప్పి 3 గంటలు కూడా సరిగ్గా ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీకి రైతులంటే ఎందుకింత కక్ష అని నిలదీస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల ఉచిత కరంటుతో వ్యవసాయం సాఫీగా సాగుతుంటే ఎందుకీ అక్కసు అంటూ మండిపడుతున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. బుధవారం అన్ని మండల కేంద్రాలు, రేపు నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో నిరసనలకు సిద్ధమైంది. రైతు బంధు సమితి ఆధ్వర్యంలో రైతు వేదికల వద్ద కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. సమైక్య పాలన నుంచి నేటి వరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రథమ శత్రువుగానే ఉంటున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరంటు అడిగితే చంద్రబాబునాయుడు కాల్చి చంపితే, ఆయన శిష్యుడు రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఏకంగా ఉచిత కరంటే వద్దంటున్నాడని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ పార్టీ నేతలపై రైతులు తిరుగబడాలని పిలుపునిచ్చారు.
– నల్లగొండ ప్రతినిధి, జూలై 11 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, జూలై11(నమస్తే తెలంగాణ) : ఉచిత కరెంటుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రైతులతోపాటు సొంత పార్టీ కాంగ్రెస్లోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమైక్య పాలనలో వ్యవసాయం అంటేనే విరక్తి చెంది ఎంతో మంది రైతులు భూములను వదిలి పట్టణాలకు వలస వెళ్లిన సంగతి తెలిసిందే. వచ్చి రాని కరెంటుతో లోవోల్టేజీ సమస్యతో రైతులు వేగలేక భూములు పడావుబెట్టి ఇతర పనులు వెతుక్కున్నారు. చంద్రబాబు హయాంలో కరెంటు అడిగితే కాల్చి చంపగా, 9 గంటల ఉచిత కరెంటు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చిరాని కరెంటు ఇచ్చి రైతులతో చెలగాటమాడింది. ఆ సమయంలో టీడీపీలో ఉన్న రేవంత్రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుందంటూ మొసలికన్నీరు కార్చారు. అలాంటి రేవంత్రెడ్డి తన మనసులోని అక్కస్సును అమెరికాలోని ఎన్ఆర్ఐ సదస్సులో వెల్లగక్కారు. ఆది నుంచి తెలంగాణ రైతాంగంపై కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతల తీరు వివక్షపూరితంగానే కొనసాగుతూ వచ్చింది. జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టుకు కృష్ణాజలాల విడుదల విషయంలోనూ ఏనాడూ నోరు మెదపకుండా అన్యాయం చేశారు.
ఎడమ కాల్వ లిఫ్ట్ల నిర్వహణ రైతులదే అంటూ వివక్షనే ప్రదర్శించారు. ఇక ప్రాజెక్ట్ విషయంలోనూ ఏనాడూ ఆలోచించిన పాపాన పోలేదు. అలాంటి నేతలకు స్వరాష్ట్రంలో ఉమ్మడి జిల్లా వ్యవసాయంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 24గంటల ఉచిత కరెంటుతో అత్యధిక ప్రయోజనం పొందుతున్న జిల్లా కూడా నల్లగొండనే కావడం విశేషం. ఉచిత కరెంటు, రైతుబంధు లాంటి పథకాలతో జిల్లాలో 2014లో 13 లక్షల ఎకరాలుగా ఉన్న సాగుభూమి ప్రస్తుతం 25 లక్షల ఎకరాలకు చేరుకోవడం గర్వకారణంగా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత కరెంటు అవసరమే లేదంటూ.. ఎకరానికి ఒక గంట చాలంటూ మొత్తానికి 8 గంటల ఉచిత కరెంటు చాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి మాట్లాడడాన్ని జిల్లా రైతాంగం జీర్ణించుకోలేకపోతుంది. దీంతో రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతూ ఆందోళనలకు దిగారు. మంగళవారం చాలా చోట్ల రైతులు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలిపాయి. హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రైతులు నిరసన ర్యాలీ నిర్వహించి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి, చందంపేట తదితర ప్రాంతాల్లో రేవంత్రెడ్డిపై ఆగ్రహంతో శవయాత్రలు నిర్వహించారు.
నేడు, రేపూ నిరసనలు
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్
దేవరకొండ, జూలై 11 : సాగుకు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో రైతు వ్యతిరేక ఆలోచన నిరసనగా బుధవారం మండల కేంద్రాల్లో, గురువారం నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన సీఎం కేసీఆర్ను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకొని అమలు చేసేందుకు ముందుకు వెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలా అనడం విడ్డూరంగా ఉన్నదని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్ వద్దని రైతుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. 70 ఏండ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి ఉండేదని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని తెలిపారు. నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు.