రామగిరి, డిసెంబర్ 16 : రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24 నుండి జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆర్ఏ (రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ -2024) నల్లగొండ జిల్లా నాయకుడు గొంపెల్లి భిక్షపతి తెలిపారు. మంగళవారం నల్లగొండలోని సీఆర్టీయూ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ పొంది ఇప్పటికి సుమారు 20 నెలలు గడిచినా, వారికి ఇవ్వాల్సిన పెన్షన్ బకాయిలు, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఫైనల్ క్యాష్మెంట్, జీఐఎస్, టీడీఎల్ ఐ, సీఆర్నీ ఏరియర్స్, సర్వీస్ కాలంలో సరెండర్ చేసిన లీవ్ డబ్బులు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి చెల్లించబడలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 63 సంవత్సరాల వయసులో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు వారి ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పిల్లల వివాహాలు చేయలేక, ఇంటి లోన్స్, ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
ఈ పరిస్థితుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 30 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ అందులో కనీసం రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిలకు చెల్లించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2024 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులందరికీ రావాల్సిన పెన్షన్ బకాయిలు ఏకమొత్తంగా చెల్లించేందుకు ప్రతి నెలా వెయ్యి కోట్లు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ముజాహిద్ ఆలీఖాన్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కాటబత్తుల గణేశ్, మీడిగ రఘు, వందనం వెంకటేశ్వర్లు, గౌస్, మోహన్రెడ్డి, లింగయ్య, భిక్షం, కరుణాకర్రెడ్డి, రాములు పాల్గొన్నారు.