నల్లగొండ, సెప్టెంబర్13 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులదేనని జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్, దేవరకొండ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన సర్వ సభ్య సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, క్షేత్రస్థాయిలో చేరుతున్న అంశాలపై మాట్లాడారు. ముందుగా ఆయా శాఖల్లో నెలకొన్న సమస్యలను ఎంపీపీలు, జడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకు రాగా వాటిని పరిష్కరించాలని కోరుతూ ఆ తర్వాత ఆయా శాఖల్లో అధికారుల పనితీరును దృష్టిలో పెట్టుకోని ప్రస్తావించారు.
ఈ సందర్భంగా చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శాఖ ఉన్నతాధికారి ఆయా శాఖల్లో జరుగుతున్న లేదంటే అమలవుతున్న ప్రతి అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పథకాన్ని గ్రామం నుంచి జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధి వద్దకు తీసుకెళ్లి వారితో చర్చించి క్షేత్రస్థాయిలో సంపూర్ణంగా అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జనరల్ బాడీ సమావేశాలకు కింది స్థాయి అధికారులను ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఫిషరీస్, మార్కెటింగ్, పశుసంవర్ధ్దక, సహకార, చేనేత, ఫారెస్ట్ శాఖల అధికారులు రాకుండా కింది స్థాయి అధికారులను ఎందుకు పంపించారని ప్రశ్నించారు.అధికారులు నిర్లక్ష్యం వహిస్తే అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో ట్రైకార్ చైర్మన్ రాంచందర్ నాయక్, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి పాల్గొన్నారు.
జడ్పీ సమావేశంలో ఆయా శాఖలకు సంబందించిన సమస్యలు లేవనెత్తిన సభ్యులు వాటిని పరిష్కరించాలని ఏకరువు పెట్టారు. విద్యుత్ శాఖలో కంట్రాక్టర్లు ట్రాన్స్ఫార్మర్ల బిగింపు సమయంలో రైతులతోనే దిమ్మెలు కట్టిస్తున్నారని వాటి వద్ద ఏవీ స్విచ్లు ఏర్పాటు చేయడం లేదని అన్నారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లకు నిధులు ఇచ్చినా పనులు సకాలంలో ఎందుకు పూర్తి చేయడం లేదని సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు వారిని నిలదీశారు. చండూర్లో పశు సంవర్ధ్దక శాఖ భూమిని ప్రైవేటు వెంచరు నిర్వాహకులు ఆక్రమించుకుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదని స్థ్దానిక జడ్పీటీసీ నిలదీయగా వెంటనే ఆర్డీఓతో విచారణ చేయిస్తానని కలెక్టర్ తెలిపారు. రేషన్ షాపులు కొత్త జీపీలకు ఇవ్వక పోవడం వల్ల రేషన్దారులు ఇబ్బంది పడుతున్నారని కొత్తగా డీలర్లను నియమించకపోయినప్పటికీ ఆయా పంచాయతీల్లో కొత్త కౌంటర్లు పెట్టి బియ్యం ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం అన్ని శాఖలను నిధులు ఇస్తున్నప్పటికీ ప్రజా ప్రతినిధులను ఎందుకు భాగస్వామ్యం చేయడం లేదు. చేనేత శాఖకు సర్కారు ఎన్నో నిధులు ఇస్తున్నప్పటికీ మాకు తెలువకుండానే సొసైటీల ద్వారా లబ్ధి చేస్తున్నందుకు సంతోషమే అయినప్పటికీ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు సమాచారం ఇవ్వాలి. గ్రామాల్లో ట్రాక్టర్ వీల్స్ వల్ల రోడ్లు మొత్తం చెడిపోయి రోడ్డు వేసిన ఏడాదికే ఆగమాగం అవుతున్నందున దీనిపై రైతులకు ఆర్టీఓ యంత్రా ంగం అవగాహన కల్పించాలి. బీసీ రుణాల్లో గౌడ్స్, పద్మశాలీలు పెద్దగా దరఖాస్తు చేసుకోక పోవడం వారికి అన్యాయం జరిగిందని దీనిపై అధికారులు ముందస్తుగా అవగాహన కల్పిస్తే అందరికీ న్యాయం జరిగేదని అన్నారు. చిట్యాలలో ఏడెనిమిది ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతున్నప్పటికీ సర్వే రికార్డ్సు వారు సకాలంలో సర్వే ఎందుకు చేయడం లేదు. వెంటనే సర్వే చేసి ఆ భూమిని రక్షించండి.
– చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్యే, నకిరేకల్
మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో అధికారులు చిత్త శుద్ధితో పని చేయక పోవడం వల్ల ప్రజలకు పూర్తి స్థాయిలో నీరందడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతున్నది. దేవరకొండ నియోజక వర్గం పరిధిలో ఈ సారి వర్షాలు లేక బోరు బావుల్లోనూ నీరు లేకుండా పోతున్నది. తాగు నీటి విషయంలో జాగ్రత్తలు వహించి ప్రతి ఇంటికీ నీరందించాలి. ఇక గురుకుల ఆర్సీవోలు పేద పిల్లలకు సీట్లు ఇవ్వకుండా వారికి నచ్చిన వాళ్లకు ఇవ్వడం సరికాదు. కనీసం ఫోన్ చేసినా ఎత్తకుండా ఉండటం సరికాదు. ఇక డిండి నుంచి పోలేపల్లి వరకు రోడ్డు పూర్తి స్థాయి డ్యామేజ్ అవుతున్నందన అక్కడ బీటీ కాకుండా మొత్తంగా సీసీ రోడ్డు వేసేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి.
– రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే, దేవరకొండ
ప్రభుత్వ పథకాలు అమలు చేసే క్రమంలో అధికారుల తప్పని సరిగా ప్రొటోకాల్ పాటించాలి. అందరి ప్రజాప్రతినిధులను తప్పని సరిగా ఆహ్వానించి కార్యక్రమం నిర్వహించాలి లేదంటే చర్యలు తప్పవు. ఇక గురుకుల సీట్ల విషయంలో ఇక నుంచి మిగిలి పోయిన సీట్లను భర్తీ చేసేందుకు పారదర్శకంగా నిర్వహిస్తాం. డీఈఓతో కలిసి నేనే ప్రత్యక్షంగా నింపే బాధ్యత తీసుకుంటాం. కింది స్థ్దాయి అధికారులు స్పందించకపోతే తన దృష్టికి తీసుకొని రావాలి.
– కలెక్టర్ ఆర్వీ కర్ణన్