సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 22 : రాజులు గతించారు.. రాచరికాలు అంతరించాయి. కానీ.. రాచకొండ ప్రాంతంలో అలనాటి చారిత్రక కట్టడాలు, దేవాలయాలు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. రేచర్లపద్మ నాయకులు ఏలిన కొండ రాచకొండ. రేచర్ల పద్మ వంశంలో 3వ సర్వజ్ణ సింగ భూపాలుడు రాచకొండ ప్రాంతాన్ని తెలంగాణకు రాజధానిగా చేసుకుని పరిపాలించాడని చరిత్ర చెబుతుంది. అంతకుముందు కాకతీయుల కాలంలో రాచకొండలో 105 దేవాలయాలు, 100 మంటపాలు, గొలుసుకట్టు చెరువులు, రాచకొండ గుట్ట చుట్టూ శత్రు దుర్భేద్యమైన రాతి కట్టడాలు నిర్మించారు. హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాచకొండ ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరుగడంతో ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సంకల్పించారు. ఈ క్రమంలో శిథిలావస్థకు చేరిన కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయాన్ని రూ.6 కోట్లతో పునర్నిర్మాణం చేపడుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి శివాలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు.
రూ.6 కోట్లతో శివాలయం పునర్నిర్మాణం
కాకతీయులు కాలంలో రాచకొండ ప్రాంతంలో దాదాపు 662 సంవత్సరాల క్రితం శివాలయం నిర్మించారు. ఈ శివాలయంలో కాకతీయ రాజులు స్వయంగా పూజలు నిర్వహించేవారని చరిత్ర చెబుతుంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో భక్తులు, ప్రజలు పునర్నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని కోరారు. దాంతో ఎమ్మెల్యే సొంత నిధులతోపాటు ప్రభుత్వం, దాతల సహకారంతో రూ.6కోట్లతో ఆలయ పునర్మిర్మాణ పనులు చేపట్టారు. యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణంలో భాగస్వామ్యమైన స్థపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఆలయ పునర్నిర్మాణం చేపడుతున్నారు. శివాలయం దగ్గర విద్యుత్, నీటి సౌకర్యం కోసం బోరు వేయించారు. ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే సంవత్సరం శివారాత్రి రోజున దేవాలయాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే రాచకొండ ప్రాంతంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రాచప్ప సమితి సభ్యులు దాతల సహకారంతో పునర్నిర్మించారు.
గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడిన భారీ శివలింగం
రాచకొండ ప్రాంతంలో గుప్త నిధుల కోసం 2013లో జరిపిన తవ్వకాల్లో 8 అడుగుల భారీ శివలింగం బయటపడింది. గాలీబ్ షహీద్ దర్గా సమీపంలోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి భక్తులు పూజలు చేస్తున్నారు. స్వయంభూ శంభులిగేశ్వరస్వామిగా భక్తులు కొలుస్తున్నారు. తవ్వకాల్లో బయటపడిన శివలింగాన్ని పునర్నిర్మిస్తున్న రాచకొండ శివాలయంలో ప్రతిష్ఠించనున్నారు.
రాచకొండను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తా
రాచకొండ ప్రాంతంలో 150 దేవాలయాలు ఉన్నాయి. అన్నింటినీ కలిపి రాచకొండను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణళికలు సిద్ధం చేస్తున్నాం. రూ.6 కోట్లతో ప్రాచీన శివాలయం అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. పనులు త్వరగా పూర్తి చేసి పీఠాధిపతులతో పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
– కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే
పనులు వేగంగా జరుగుతున్నాయి
కాకతీయుల కాలం నాటి ఎంతో ఘన చరిత్ర కలిగిన రాచకొండ శివాలయం పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 50 శాతం పనులు పూర్తయ్యాయి. గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడిన భారీ శివలింగాన్ని శివాలయంలో ప్రతిష్ఠిస్తున్నాం. రాచకొండ శివాలయాన్ని పునర్నిర్మిస్తున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి ప్రజలందరి తరఫున
కృతజ్ఞతలు.
– జక్కిడి జంగారెడ్డి, శివాలయం పునర్నిర్మాణ కమిటీ సభ్యుడు