రామన్నపేట, సెప్టెంబర్ 20 : పుట్టిన ఊరి మీద ప్రేమతో కార్పొరేట్ స్థాయిలో పాఠశాల భవనం, ఫర్నిచర్ ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు మండలంలోని ఇస్కిళ్ల గ్రామానికి చెందిన గుండా మధుసూదన్గుప్తా. తండ్రి సత్తయ్య మరణాంతరం ఆ కుటుంబం హైదరాబాద్కు వెళ్లింది. అనతికాలంలోనే మంచి బిల్డర్గా ప్రఖ్యాతలు సంపాదించాడు. హైదరాబాద్, బెంగళూర్లో కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆర్థికంగా స్థిర పడ్డాడు. దాంతో తాను పుట్టి పెరిగిన, తల్లిదండ్రులను అక్కున చేర్చుకున్న స్వగ్రామం అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నారు. సుమధుర ఫౌండేషన్ను స్థాపించి గ్రామంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో గ్రామంలో రూ. 2 కోట్లతో ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దారు.
అన్ని సౌకర్యాలతో తరగతి గదులు
11వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తరగతి గదులు నిర్మించారు. ఏడు తరగతి గదులతో పాటు ప్రధానోపాధ్యాయుడి చాంబర్, స్టాఫ్ రూమ్, డైనింగ్హాల్, స్టోర్ రూం, కిచెన్, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ,సైన్స్, సాంఘికశాస్త్రం, ల్యాబ్ల కోసం ప్రత్యేక తరగతి గదులను నిర్మించారు. బ్లాక్ల మధ్య వాష్రూమ్లు ఏర్పాటు చేశారు. పాఠశాలలో గ్రీనరీతో పాటు రెండు క్రీడా మైదానాలను ఏర్పాటు చేశారు. పాఠశాల పనులు పూర్తి కావడంతో శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించనున్నారు. అంతే కాకుండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్యూరీఫైడ్ వాటర్ ప్లాంట్, మహిళలకు, కుట్టుశిక్షణ, కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు.
పుట్టి పెరిగిన ఊరికి సేవ చేయాలనే..
పుట్టి పెరిగిన ఊరికి సేవ చేయాలనే లక్ష్యంతో సుమధుర ఫౌండేషన్ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు దీర్ఘ కాల ప్రయోజనాలు కలిగించే వాటి ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నాం.చిన్నపిల్లలకు మంచి వాతావరణంలో విద్యబోధన జరగాలనే లక్ష్యంతో పాఠశాల భవనాన్ని తన తల్లి ండ్రుల పేరు మీద నిర్మించా. సంపాదించిన దానిలో కొంత సమాజానికి ఇవ్వాలన్నదే నా తపన.
-గుండా మధుసూదన్,సుమధుర ఫౌండేషన్ చైర్మన్