సూర్యాపేట టౌన్, నవంబర్ 28 : ఎంతోమంది జీవితాల్లో విద్యా వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతీరావు పూలే 133వ వర్ధంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఎంజీ రోడ్డులో గల విగ్రహానికి సోమవారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహనీయుల కళలు సాకారం అవుతున్నాయన్నారు.
అందుకే తెలంగాణలో అభివృద్ధి పాలన, వినూత్న పథకాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించి కుల మతాల రహిత సమాజాన్ని నిర్మాణానికి అంద రూ విద్యావంతులు కావాలన్న సంకల్పంతో జీవితాంతం పనిచేశారని కొనియాడారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడి ప్రజలంతా ఎలాంటి విభేదాలు లేకుండా ఐక్యతతో కలిసిమెలిసి ఉంటారో ఆ ప్రదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నమ్మిన మహనీయుల ఆశయాలను సాకారం చేస్తున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అంతేగాక పూలే పేరుతో బీసీ గురుకులాలు ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నారన్నారు.
పూలే స్ఫూర్తితో రాష్ట్రంలో 1000కి పైగా గురుకులాలు ఏర్పాటు చేసి లక్షలాది మంది విద్యార్థులకు కార్పొరేట్ను తలదన్నే రీతిలో విద్యనందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, ఉమ్మడి నల్లగొండ డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, గండూరి ప్రకాశ్, గుడిపూడి వెంకటేశ్వర్రావు, డాక్టర్ రామ్మూర్తి, గండూరి కృపాకర్, సవరాల సత్యనారాయణ, లక్ష్మీకాంత్, వసంత సత్యనారాయణ పిళ్లె, చల్లమళ్ల నర్సింహ, సల్మా మస్తాన్, విజయ, రేణుక, రమణ, విజయ, పావని పాల్గొన్నారు.