చండూరు, మార్చి 18 : మండలంలోని తిమ్మారెడ్డిగూడెంలో రేషన్ డీలర్ను నియమించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని తిమ్మారెడ్డిగూడెంలో ప్రజా సమస్యలపై నిర్వహించిన ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సింహులగూడెం ప్రధాన బీటీ రోడ్డు నుండి తిమ్మారెడ్డిగూడెం వరకు జరిగే రోడ్డు పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నత్త నడకగా సాగుతున్నాయని, ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ గ్రామం నుండి రేషన్ బియ్యం కోసం ప్రజలు రెండు కిలోమీటర్ల దూరం నుండి తుమ్మలపల్లి గ్రామానికి వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేస్తూ మహిళలకు రూ. 2,500 ఇవ్వాలని అలాగే భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని, స్థలం లేని వారికి ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా భూమిలేని పేదలకు ఆత్మీయ భరోసా వర్తింపజేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24, 25, 26 తేదీల్లో తాసీల్దార్ కార్యాలయల ఎదుట రిలే నిరాహార దీక్షలను నిర్వహించనున్న తెలిపారు. ఈ దీక్షలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, ఈరటి వెంకటయ్య, గ్రామస్తులు ముత్తయ్య, యాదయ్య, కృష్ణ పాల్గొన్నారు.