కొండమల్లేపల్లి, జూన్ 30 : తెలంగాణ ద్రోహి రేవంత్రెడ్డి ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ కారులపై రైఫిల్ ఎక్కుపెట్టిన విలన్ పాత్ర రేవంత్రెడ్డి చరిత్ర అని ఆరోపించారు.
తెలంగాణ సాధన కోసం అమర నిరహర దీక్ష చేపట్టి, చావునోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించిన తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కేసీఆర్ను విమర్శించే ఆర్హత లేదని అన్నారు. రేవంత్రెడ్డి సీఎం హోదా దిగజార్చి మాట్లాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు. జిల్లాలో చేసిన అభివృద్ధి, చేయబోయే అభివృద్ధి,సంక్షేమంపై మాట్లాడకుండా మాజీ మంత్రి, సుర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం రాజకీయ నేతల లక్షణం కాదని అన్నారు.
కేసీఆర్కు ఉద్యమంలో అండగా ఉంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిధుల వరద పారించి అభివృద్ధి, సంక్షేమంతో జిల్లా రూపురేఖలు మార్చిన ఘనత జగదీశ్రెడ్డికే దక్కిందన్నారు. రేవంత్రెడ్డి మాట్లాడిన 32 నిమిషాల ప్రసంగంలో దాదాపు 25 నిమిషాలు కేసీఆర్ను, బీఆర్ఎస్ నాయకులను తిట్టడమే తప్ప రాష్ట్ర ప్రజలకు, రాష్ర్టానికి ఏం చేయనున్నారో ప్రస్తావించలేదన్నారు.
కేటీఆర్, హరీశ్రావులు తెలంగాణ రాజకీయ కురుక్షేత్రంలో కౌరవ కాంగ్రెస్ పాలన అంతం చేసే కృష్ణార్జులని అన్నారు. డిండి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులపై గొప్పలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టడమే తప్ప ఇప్పటి వరకు తట్టమట్టి కూడా తియ్యలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటనతో ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు. రేవంత్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని రాష్ట్ర అబివృద్ధిపై దృష్టి సారించాలని లేని పక్షంలో బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.