నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 14 : నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి నగరోత్సవం నల్లగొండ పుర వీధుల గుండా బుధవారం శోభాయమానంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని రామాలయం ఆవరణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి పూజలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నగరోత్సవాన్ని ప్రారంభించారు.
పట్టణంలోని రామగిరి, క్లాక్టవర్, ఎన్జీ కళాశాల సర్కిల్, వీటీ కాలనీ మీదుగా చెర్వుగట్టు వరకు స్వామి, అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. నగరోత్సవంలో భాగంగా కోలాటం, భజన బృందాలతోపాటు విద్యుత్ కాంతుల నడుమ, దేవతామూర్తుల వేషధారణలో భక్తులతో కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా నగరోత్సవానికి నీరాజనం పలికారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, కౌన్సిలర్లు ప్రదీప్నాయక్, శ్రీనివాస్, ఈఓలు నవీన్, నాగిరెడ్డి, సత్యనారాయణ, చెర్వుగట్టు ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్రెడ్డి పాల్గొన్నారు.