నేల తల్లిని నమ్ముకుని బతికే రైతు చనిపోతే ఒకప్పుడు ఆ కుటుంబం దిక్కూమొక్కు లేనిదయ్యేది. ఇతర కారణాలను పక్కన పెడితే, వ్యవసాయంలో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నా పరిహారం చెల్లింపు ఊసే ఉండేది కాదు. పైగా నాటి పాలకుల బాధ్యత లేని ధోరణిలు, అపహాస్యపు మాటలు బాధిత కుటుంబాన్ని మరింత కుంగదీసేవి. తెలంగాణ రాష్ట్రంలో రైతు కుటుంబాల్లో అలాంటి పరిస్థితి ఉండొద్దని సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు బీమా వేల కుటుంబాల్లో వెలుగు నింపుతున్నది. రైతు ఏ కారణంతో మరణించినా 5లక్షల రూపాయలు అందించే బీమా పథకాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించేందుకు కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా సోమవారం నుంచి కొత్త దరఖాస్తులకు అవకాశం కల్పించింది. నిర్ణీత వయస్సు గల రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధ్దమైంది.ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 5.42లక్షల మంది రైతులు బీమా పథకం పరిధిలో ఉండగా ఈసారికి 5.60లక్షలు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతూ నిర్ణీత వయత కలిగి ఏ విధంగా చనిపోయినా తక్షణమే ఆదుకోవాలన్నది పథక ముఖ్య ఉద్దేశం. ప్రీమియం చెల్లింపుల్లో ఒక్క పైసా రైతులపై భారం పడకుండా మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. కారణమేదైనా రైతు మరణించిన 10రోజుల్లోపే ఆ కుటుంబానికి ఐదు లక్షల బీమా సొమ్మును అందించేలా పథకం రూపొందించారు. 2018 ఆగస్టు 15నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశాక… వాటి ప్రకారం ఈ పథకానికి విధివిధానాలు ఖరారు చేశారు. భారతీయ జీవిత బీమా(ఎల్ఐసీ) సంస్థ ప్రకారం ఉండే నిబంధనల మేరకు 18ఏండ్లు నిండి 59ఏండ్ల వయస్సు కలిగిన రైతులందరూ ఈ పథకంలో అర్హులుగా ప్రకటించారు. వారి వివరాలు సేకరించి ప్రీమియం చెల్లింపులు చేశారు. 2018-19 తొలి ఏడాది ఒక్కో రైతుకు రూ.2,271 ప్రీమియంగా చెల్లించిన ప్రభుత్వం, 2022-23 సంవత్సరానికి వచ్చే సరికి ప్రీమియం బాగా పెరగ్గా రూ.3570 చెల్లించి బీమాను కొనసాగిస్తున్నది. ఈ ఏడాది సైతం ప్రీమియం చెల్లింపులకు కసరత్తు చేస్తున్నది. ఆగస్టు 14వ తేదీ ఆరంభం నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది.
రైతు బీమా పథకంలో రైతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుత ఏడాది 5.42లక్షల మంది రైతులు బీమా పథకం పరిధిలో ఉన్నారు. ఆగస్టు నుంచి రెన్యూవల్ కానున్న పథకంలో మరింత మంది రైతులకు అవకాశం లభించనుంది. దీంతో అర్హులైన రైతుల సంఖ్య 5.60లక్షలు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కారణమేదైనా సరే రైతులు అకాల మరణం పొందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేలా రైతు బీమా పథకం అమలు చేస్తుండడంతో మంచి ఆదరణ పొందింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 5.42లక్షల మంది బీమా పథకంలో అర్హులుగా ఉన్నారు. ఈ పథకం వల్ల ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 6,256 మంది రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.312.80 కోట్ల బీమాను డబ్బులు అందించారు. సూర్యాపేట జిల్లాలో 3500 మంది రైతుల కుటుంబాలకు రూ.175కోట్లు బీమాగా చెల్లించారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో ఇప్పటివరకు 2961 మంది రైతు కుటుంబాలకు 141.45కోట్ల రూపాయలను బీమా సొమ్ముగా చెల్లించారు. మధ్యలో ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా పైరవీకారులతో పని లేకుండా పైసా ఖర్చు లేకుండా నేరుగా ఈ సొమ్మంతా రైతు కుటుంబాలకే చెందుతుంది. దీంతో రైతు మరణించిన అనంతరం ప్రభుత్వం చెల్లిస్తున్న బీమా సొమ్ము ఆ కుటుంబాలు నిలదొక్కుకునేందుకు ఎంతో ఆసారానిస్తుంది. అప్పులు, ఇతరత్రా ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగంగా మారాయి.
ఈ పథకంలో ఇప్పటికే ఉన్న రైతులతో పాటు గతేడాది నుంచి కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులకు అవకాశం కల్పించనున్నారు. వచ్చే నెల 4వరకు దరకాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న రైతులకు దరఖాస్తులకు అవకాశం కల్పించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. 14-08-1964 నుంచి 14-08-2005 మధ్యలో జన్మించిన వారంతా బీమా పరిధిలోకి రానున్నారు. ఆధార్కార్డు ఆధారంగానే పుట్టిన తేదీనే పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో 18నుంచి 59 సంత్సరాల నడుమ వయస్సు కలిగిన ప్రతిఒక్కరూ దరకాస్తు చేసుకోవచ్చు. ఆయా మండలాల పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు వీటిని స్వీకరించి ఎప్పటికప్పుడే ఆన్లైన్లో ఎంట్రీ చేయనున్నారు. ఇప్పటికే వ్యవసాయ క్లస్టర్ల వారీగా బీమా పథకానికి అర్హులైన వారి వివరాలను అందుబాటులో ఉంచారు. వీరంతా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణాధికారులు సూచిస్తున్నారు. వీరితో పాటు గతంలో ఈ పథకంలో ఉన్న రైతులు సైతం మరోసారి తమ చిరునామాలు, నామినీల పేర్లను సరి చూసుకోవాలని సూచించింది. రైతుల పేర్లు, వారి నామీల పేర్లు, బ్యాంకు అకౌంట్ వివరాలు, పట్టాదార్ పాస్ పుస్తకాల నంబర్లు, ఆధార్ కార్డు వివరాలు సరిగా లేకపోతే బీమా చెల్లింపుల్లో ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉన్నది. అందువల్ల ఇప్పటికే ఈ పథకంలో ఉన్న రైతులు తమ వివరాలను సరి చూసుకునేందుకు… కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు దరకాస్తు చేసుకునేలా అవకాశం కల్పించింది.