నకిరేకల్, ఏప్రిల్ 3: నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ బాలుడిపై దాడి చేసి గాయపర్చిన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నకిరేకల్లోని శివాజీనగర్కు చెందిన గంట శంకర్ సరస్వతి దంపతుల కుమారుడు శరత్చంద్ర(4) పట్టణంలోని సాధన ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. శుక్రవారం సెలవుదినం కావడంతో ఉదయం 9 గంటలకు ఇంటి ఎదుట ఆడుకుంటుండగా పిచ్చికుక్క విచక్షణారహితంగా బాలుడిపై దాడి చేయడంతో అతడి ముఖంపై గాయాలయ్యాయి.
బాలుడు కేకలు వేయడంతో తల్లిదండ్రులు వెంటనే నకిరేకల్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యుడు నీలోఫర్కు రెఫర్ చేయడంతో చికిత్స నిమిత్తం బాలుడిని హైదరాబాద్కు తరలించారు. ఇటీవల మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పట్టణంలోని పిచ్చికుక్కలు, కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, కమిషనర్ రంజిత్కుమార్ తెలిపారు. కోతులు, పిచ్చికుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.