– ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి టీఎస్యూటీఎఫ్ వినతి
మునుగోడు, ఏప్రిల్ 10 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉచిత యూనిఫాంల కుట్టు విషయంలో పూర్తి నాణ్యత పాటించాలని టీఎస్యూటీఎఫ్ (TSUTF) నల్లగొండ జిల్లా కార్యదర్శులు గేర నర్సింహ, నలపరాజు వెంకన్న అన్నారు. ఈ మేరకు శుక్రవారం మునుగోడు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
గత ఏడాది మహిళా సమాఖ్యల ద్వారా కుట్టించిన యూనిఫాంలు నాణ్యత లోపంతో ఉన్నాయని, విద్యార్థుల శరీర కొలతలకు ఏమాత్రం సంబంధం లేకుండా ఉండటం వల్ల అవి వృథా అవుతున్నాయని ఆరోపించారు. సింగిల్ స్టిచ్చింగ్ చేయడం వల్ల నెల రోజులకే కుట్లు ఊడిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రస్తుత స్టిచ్చింగ్ ఛార్జీలు చాలా తక్కువగా ఉండటం వల్ల టైలర్లు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారని, అందుకే ప్రస్తుతం ఇస్తున్న జతకు 75 రూపాయల బదులు అదనంగా జతకు 150 రూపాయల చొప్పున కుట్టు ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
మునుగోడు నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఉన్న 134 పాఠశాలల్లో దాదాపు 7,700 మంది విద్యార్థులు బడుగు, బలహీన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మేలు జరిగేలా మండల విద్యాధికారులతొ సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ వెంటనే విద్యాధికారులతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు కుట్టుటలో నాణ్యత పాటించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ మండల అధ్యక్షడు బిక్కుమల్ల రాములు, ప్రధాన కార్యదర్శి పెరిక నరసింహ, ఉపాధ్యక్షుడు కూన్రెడ్డి సుధాకర్ రెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.