సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 7 : పుట్టపాక గ్రామ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తం కీర్తిస్తున్నది. ఇప్పటి వరకు పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యానికి రెండు పద్మశ్రీ అవార్డులతోపాటు పలు జాతీయ అవార్డులు దక్కాయి. పుట్టపాక చేనేత కళాకారులు మరోసారి ప్రతిభ కనబరిచి జాతీయ అవార్డు సాధించారు. చేనేత, జౌళి శాఖ 2018 సంవత్సరానికిగానూ జాతీయస్థాయి హస్తకళా పురస్కారానికి 18 మంది చేనేత కళాకారులను ఎంపిక చేసి 2021సంవత్సరంలో అవార్డులను ప్రకటించింది.
సంస్థాన్నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు కొలను పెద్దవెంకయ్య, కొలను రవీందర్ పది నెలల పాటు శ్రమించి తయారు చేసిన తేలియా రుమాలు డబుల్ ఇక్కత్ చీరెకు సంయుక్తంగా జాతీయ అవార్డు దక్కింది. చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, దర్శన జర్దోష్ అవార్డును వారికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కొలను పెద్దవెంకయ్య మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులు 10 నెలలపాటు కష్టపడి డిజైన్ చేసి ప్రకృతి సిద్ధమైన రంగులతో తేలియా రుమాలు చీరెను తయారు చేశామన్నారు. అవార్డు కోసం దరఖాస్తు పెట్టడానికి కూడా తమ దగ్గర డబ్బులు లేవని, అందుకే అవార్డు రావడానికి 30 ఏండ్లు పట్టిందని తెలిపారు. జాతీయ అవార్డు అందుకోవడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.