నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి7(నమస్తే తెలంగాణ) ; కేఆర్ఎంబీకి కృష్ణానది ప్రాజెక్టులు అప్పగింతను నిరసిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ సభకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్న బహిరంగసభ కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా సభా స్థలాన్ని ఎంపిక చేశారు. నల్లగొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్లో నార్కట్పల్లి-అద్దంకి రహదారికి ఆనుకుని విశాలమైన స్థలంలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సభాస్థలాన్ని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు పరిశీలించారు. సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
కేంద్రం పరిధి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కాపాడుకునేందుకు ఈ నెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. ఈ సభకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. బుధవారం సభా స్థలాన్ని ఫైనల్ చేస్తూ పోలీసుల అనుమతి కోరారు. నల్లగొండ శివారులోని మర్రిగూడ బైపాస్లో నార్కట్పల్లి- అద్దంకి రహదారికి ఆనుకుని ఉన్న సభాస్థలాన్ని ఎంపిక చేశారు. ఈ స్థలాన్ని జగదీశ్రెడ్డితో పాటు బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, యాదాద్రి జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్, సమన్వయకర్త రవీందర్సింగ్ పరిశీలించారు. సభా వేదిక, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. సభకు వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. సభకు పెద్ద సంఖ్యలో తరలిచ్చే అవకాశాలు ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రజలు, ముఖ్యంగా రైతులు తరలిరానున్నట్లు నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో సభకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. నేటి నుంచి సభాస్థలం చదును చేయడంతో పాటు ఇతర ఏర్పాట్లను కూడా చకచకా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారు. సభకు పోలీసుల అనుమతి తప్పనిసరి కావడంతో జిల్లా ఎస్పీ చందనా దీప్తిని కలిసి లేఖను అందజేశారు. నిబంధనల ప్రకారం పరిశీలించి అనుమతిపై నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ వెల్లడించారు.