భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 28 : ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ప్రజల సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి జిల్లా స్థాయి అధికారులు సకాలంలో హాజరు కావాలని అన్నారు. మొత్తం 9 ఫిర్యాదులు స్వీకరించామని, అందులో రెవెన్యూ శాఖకు-8, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందినవి ఒకటి ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి నాగేశ్వరాచారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాయగిరిలో జరుగుతున్న దొంగతనాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామానికి చెందిన యువకులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో కొన్ని రోజులుగా గొర్రెల దొంగతనాలు జరుగుతున్నాయని, దొంగతనాలకు గురైన బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బొజ్జ భానుచందర్, మల్లెబోయిన బాలనర్సింహ, ముద్దం ఉపేందర్ ఉన్నారు.
బీబీనగర్, నవంబర్ 28 : మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు అవకాశం కల్పించాలని కోరుతూ అదనపు కలెక్టర్ దీపక్ తివారీకి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో దివ్యాంగులు గొలనుకొండ లాలయ్య, పంజాల చంద్రశేఖర్, ఉండింటి రమేశ్, తెలపల్లి శివకుమార్, ప్రవీణ్, శ్రీనివాస్రెడ్డి, రాము, నందు, రమణ పాల్గొన్నారు.