బొడ్రాయిబజార్, డిసెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం పథకాల దరఖాస్తుల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నోడల్ అధికారి ఆర్వీ కర్ణన్ సూచించారు. ప్రజాపాలన సభల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేటలోని 3, 19, 20, 35, 36, 45వ వార్డుల్లో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణలో భాగంగా 19వ వార్డులో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు.
జిల్లా కేంద్రంలో ప్రజాపాలన గ్రామసభలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని చోట్లా కేవలం ఐదారు కౌంటర్లు మాత్రమే పెట్టి దరఖాస్తులు స్వీకరిస్తుంటే, సూర్యాపేట జిల్లా కేంద్రంలో 8 నుంచి 9 కౌంటర్లు పెట్టి దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. అన్ని సంక్షేమ పథకాలకు ఒకే అప్లికేషన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, రేషన్కార్డు లేకున్నప్పటికీ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఆయా వార్డుల్లో సభ నిర్వహించిన రోజున ఎవరైనా అందుబాటులో లేకుంటే ఆ తర్వాత తమ దరఖాస్తులను స్థానిక అధికారులకు సమర్పించవచ్చన్నారు. అన్ని ప్రజాపాలన సభల్లో జనరల్ కౌంటర్ను కూడా ఏర్పాటు చేసి ప్రజల నుంచి సమస్యలపై కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, ఏఎస్పీ నాగేశ్వర్రావు, జడ్పీ సీఈఓ సురేశ్, మెప్మా పీడీ రమేశ్నాయక్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు గండూరి పావనీకృపాకర్, సుంకరి అరుణారమేశ్, ధీరావత్ రవినాయక్, ఆయా వార్డుల నాయకులు పాల్గొన్నారు.