నీలగిరి, జనవరి 24 : కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే సత్ఫలితాలు ఇస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలోనూ మూడు సార్లు సర్వే ద్వారా బృహత్తర ఫలితాలు సాధించారు. కరోనా వ్యాప్తిని ప్రాథమిక దశలోనే గుర్తించి అడ్డుకోవడానికి సర్వే ఎంతగానో దోహదపడింది. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగిస్తూ మరో వైపు కరోనాను అరికట్టేందుకు సీఎం కేసీఆర్ దూర దృష్టితో ప్రారంభించిన ఇంటింటి సర్వే అద్భుత ఫలితాలు ఇస్తున్నది. సర్వే ద్వారా.. ప్రాథమిక లక్షణాలు ఉన్నవారిని, దవాఖానకు వెళ్లేందుకు సంకోచించేవారిని గుర్తించి నాలుగు రోజులుగా ఇంటి దగ్గరే మందులు ఇస్తున్నారు. గత రెండు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న సర్వే వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధిక శాతం బాధితులు ఇంటి వద్దే మందులు వాడుతున్నారు.
గతంలో జ్వరం సర్వే వివరాలు ఇలా…
నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు నాలుగు దఫాలుగా జ్వర సర్వే చేశారు. వైద్యబృందాలు మే నెలలో ఇంటింటికీ తిరిగి పలు లక్షణాలతో బాధపడుతున్న వారికి మెడికల్ కిట్లు అందించాయి. తొలి విడుతలో 4,40,960 ఇండ్లలో సర్వే చేయగా 10,935 మందిని గుర్తించి 9,663 మందికి మెడికల్ కిట్స్, 169 మందికి స్టెరాయిడ్స్ ఇచ్చారు.
రెండో దఫా సర్వేలో 5,669 మందిలో లక్షణాలు గుర్తించి కిట్లు, 68 మందికి స్టెరాయిడ్స్ అందించారు.
జూలై నెలలో మూడో విడుత సర్వేలో 3,844 మందిని గుర్తించి కిట్లు, మరో ఇద్దరికి స్టెరాయిడ్స్ ఇచ్చారు. ప్రస్తుతం నాలుగో విడుతలో సోమవారం నాటికి 2,67,820 గృహాల్లో సర్వే పూర్తి చేశారు. 9,408 మందికి మెడికల్ కిట్లు, ఇద్దరికి స్టెరాయిడ్స్ ఇచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలి విడుతలో 2,60,290 గృహాల్లో సర్వే చేసి 4,633 మందికి మెడికల్ కిట్లు ఇచ్చారు.
రెండో విడుతలో 1,53,212 గృహాల్లో సర్వే చేసి 4,485 మందికి మెడికల్ కిట్లు ఇచ్చారు.
సూర్యాపేట జిల్లాలో గతంలో ఐదుసార్లు సర్వే పూర్తి చేశారు. మొత్తం 3,19,645ఇండ్లలో సర్వే జరిగింది. తొలి విడుతలో 10,038మందికి, రెండో విడుతలో 9,701 మందికి, మూడో విడుతలో 3,758మందికి, నాలుగో విడుతలో 2,662మందికి ఐదో విడుతలో 2,394మందికి మెడికల్ కిట్లు అందించారు. ప్రస్తుతం 1,27,284 ఇండ్లలో సర్వే చేసి 1,525 మంది అనుమానితులకు మెడికల్ కిట్లు అందించారు.
బహుముఖ యుద్ధం..
కరోనా కట్టడికి రాష్ట్ర సర్కారు బహుముఖ యుద్ధం చేస్తున్నది. ఓవైపు ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసింది. వ్యాక్సినేషన్ ముమ్మరం చేసింది. సబ్సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలకు అంతరాయం లేకుండా చూస్తున్నది. ఇదే సమయంలో సర్వే ద్వారా ఇంటింటికీ వెళ్తున్న వైద్య బృందాలు ప్రజల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ నుంచి ఎంపీడీఓ, మున్సిపాలిటీల్లో వార్డుల నుంచి కమిషనర్.. అక్కడి నుంచి కలెక్టర్కు ప్రజల ఆరోగ్య వివరాలు అందుతున్నాయి. కొవిడ్ లక్షణాలున్న వారికి మందులు ఇవ్వడంతో పాటు వాటిని ఎలా వేసుకోవాలో సూచిస్తున్నారు. హోం ఐసొలేషన్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలను, జాగ్రత్తలను వివరిస్తున్నారు. బాధితులు అడిగే ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం ఇస్తున్నారు. ఏవైనా సందేహాలుంటే సంప్రదించాల్సిందిగా సూచిస్తూ భరోసా కల్పిస్తున్నారు.
సర్వేతో అద్భుత ఫలితాలు..
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నది. అవగాహన లోపం కారణంగా కరోనా లక్షణాలున్న వారు కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత దవాఖానకు పరుగులు తీసేవారు. గతంలో లాక్డౌన్ సమయంలోనూ వ్యవసాయ పనుల పేరిట ఇస్టానుసారంగా బయట తిరిగారు. కొంతమంది లక్షణాలున్నా బయటకు చెప్పకుండా మిన్నకుండిపోయారు. దాంతో కొవిడ్ విజృంభించింది. ఈ నేపథ్యంతో ఈ సారి సర్వేతో వైద్యారోగ్య శాఖ సిబ్బంది ప్రతి ఇంటి తలుపు తట్టడంతో మహమ్మారిని కట్టడి చేసేందుకు అవకాశం ఏర్పడింది. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి ముందస్తుగా కిట్లు అందజేయడంతో వ్యాప్తి తగ్గిపోయింది. ఎంతో మంది అనుమానాలకు సర్వే ద్వారా పరిష్కారం లభించింది.
కరోనా కట్టడికి జ్వర సర్వే దోహదం
కరోనా కట్టడికి ఇంటింటి జ్వర సర్వే దోహదం చేసింది. లక్షణాలున్న వారిని గుర్తించి ఇంటి వద్దే మందులు అందించడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. దవాఖానకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రజలంతా సర్వేకు సహకరిస్తూ
జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి లక్షణాలున్నా వైద్య సిబ్బందికి తెలియజేయాలి. వారి సలహాలు, సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి.