అనంతగిరి, ఫిబ్రవరి 13: రైతులకు యూరియా కష్టా లు తప్పేలా కనిపించడం లేదు. రైతులు క్యూలైన్లో కనిపించకూడదని భావించిన ప్రభుత్వం యాప్ను అందుబాటులో తెచ్చింది. యూప్లో యూరియా స్లాట్బుక్ కాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. సెల్ఫోన్ చేతిలో పట్టుకొని గంటలు కొద్ది నిరీక్షించినా ఒక్క యూరియా కట్టా బుక్ కాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న స్టాక్ క్షణాల్లోనే మాయమైపోతుండటంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన రైతులకు యూరియా ఆన్లైన్లో బుక్ కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం నిరసనకు దిగారు.
కోదాడ, అనంతగిరి రోడ్డుపై పురుగుల మందు డబ్బాలతో బైఠాయించారు. అనంతరం ఖానాపురం ప్రాథమిక సహకార సంఘ ఆవరణలో వ్యవసాయ అధికారులను నిలదీశారు. సంఘం పరిధిలో 444 యూరియా కట్టలు ఆన్లైన్లో పెడతామన్న సమయానికి కాకుండా… ఆలస్యంగా ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతి సీజన్లో సరిపడా యూరియా అందుబాటులో ఉంచకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సంఘ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
పెన్పహాడ్, ఫిబ్రవరి 13 : అదును దాటుతున్నా యూరియా అందడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. పెన్పహాడ్ మండల కేంద్రంలోని సహకార సంఘ కార్యాలయం ఎదుట నేరేడుచర్ల-సూర్యాపేట ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ గత వానాకాలంలో కూడా యూరియా కోరత ఏర్పడిందన్నారు. యాసంగి వరి సాగుకు యూరియా కావాలని అడిగినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఉత్తమ్కుమార్రెడ్డి జిల్లాలో మంత్రిగా ఉన్నా ఫలితం లేకుండా పోతోందని, యూరియా కష్టాలను దూరం చేయ డం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిదులు స్పం దించి యాప్ను తొలగించి యూరి యా అందించాలని కోరారు.