– కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్తలు
గడ్డిపల్లి, ఫిబ్రవరి 04 : ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారం పెరిగి మిత్ర పురుగులు సంరక్షితమవుతాయని కేవీకే గడ్డిపల్లి మృతికా శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. కేవీకే గడ్డిపల్లి & జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణలో భాగంగా రెండవ రోజు రైతులకు పశువుల ఎరువులు, వర్మికంపోస్ట్–వర్మీవాష్, అజోల్లా సాగు, సర్టిఫికేషన్, మార్కెటింగ్పై శిక్షణ ఇచ్చారు. పురుగులు–తెగుళ్ల యాజమాన్యంపై సస్య రక్షణ శాస్త్రవేత్త డి.ఆదర్శ్ మాట్లాడారు. రసం పీల్చే పురుగుల నియంత్రణకు మూడు రంగుల జిగురు అట్టలు, 1,500 పిపిఎం వేప నూనె, రెక్కల పురుగులకు ఎకరానికి 4 లింగకర్షక బుట్టలు, సోలార్ దీపపు ఎర వాడాలని సూచించారు. జీవ నియంత్రణలో ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బవేరియా బసియానా, వర్టిసిలియం లకానీ వాడకం ప్రయోజనకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపిడీ ఆత్మ జి. నివేదిత, వ్యవసాయ అధికారులు కె. మల్లారెడ్డి, బి.భువనేశ్వరి, కేవీకే శాస్త్రవేత్తలు, 30 మంది రైతులు–కృషి సఖీలు పాల్గొన్నారు.