మిర్యాలగూడ, జూన్ 21: మిర్యాలగూడ కలాల్వాడలో ఈ నెల 4వ తేదీన జరిగిన అగ్నిప్రమాద సంఘటన వెనుక ఉన్న ట్రిపుల్ మర్డర్ కేసు మిస్టరీని నల్గొండ జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. తొలుత ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని అంతా భావించారు. అయితే పోలీసుల దర్యాప్తులో పకా ప్రణాళికతో జరిగిన దారుణ హత్యగా తేలిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నల్లగొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన కాళహస్తి శిరీష్కుమార్ అనే నిందితుడు గతంలో వివిధ ప్రాంతాల్లో చోరీలు, మోసాలకు పాల్పడి నేరచరిత్ర కలిగి ఉన్నాడని ఎస్పీ వివరించారు. తెలుగు మ్యాట్రిమోనీ తదితర వివాహ వెబ్సైట్ల ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని, వారి నమ్మకాన్ని సంపాదించి వివాహం చేసుకోవడం, ఆర్థిక ప్రయోజనాలు పొంది మోసం చేయడం అతనికి అలవాటు. ఈ క్రమంలో ధనలక్ష్మి అనే మహిళలతో పరిచయం పెంచుకొని వివాహం చేసుకున్నాడు. కాలక్రమేణా వారిమధ్య విభేదాలు రావడంతో ధనలక్ష్మి అతడిని దూరం పెట్టింది.
గతంలో ఓ మహిళను మోసగించి జైలుకు వెళ్లిన సమయంలో ధనలక్ష్మి తనకు సాయం చేయకపోవడం, బెయిల్ కోసం ప్రయత్నించకపోవడంతో కక్ష పెంచుకున్న నిందితుడు.. చోరీ చేసిన బైక్పై వచ్చి ధనలక్ష్మిని, ఆమె పిల్లలపై పెట్రోల్ చల్లి హత్య చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. ఈ ఘాతుకానికి పాల్పడే ముందు కొన్ని రోజుల ముందు ఇకడి పరిస్థితులపై రెక్కీ నిర్వహించాడు. సంఘటన రోజు ఉదయం ఓ యాక్టివాను దొంగిలించి మిర్యాలగూడకు వచ్చాడు. మార్గంమధ్యలో ప్లాస్టిక్ క్యాన్లో పెట్రోల్ నింపుకొని అర్ధరాత్రి అంతా నిద్రపోయాక ఇంట్లోకి ప్రవేశించి, అకడ ఉన్న ప్లాస్టిక్ బకెట్లో పెట్రోల్ పోసి నిద్రిస్తున్న వారిపై చల్లి అగ్గిపుల్ల గీసి మంటలు అంటించాడు.
ఈ క్రమంలో మంటలు నిందితుడికి కూడా అంటుకున్నప్పటికీ అకడి నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న ధనలక్ష్మి తల్లి వనం చంద్రమ్మ (48), కుమారుడు లక్ష్మణ్ (17), కుమార్తె ప్రణతి (15) మంటల్లో చికుకుని సజీవదహనమయ్యారు. ధనలక్ష్మి ఆ రోజు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి సూటీ, పెట్రోల్ క్యాన్, బకెట్, పాక్షికంగా కాలిన షర్ట్, హెల్మెట్, సెల్ఫోన్, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. డీసీఆర్బీ డీఎస్పీ రవి, మిర్యాలగూడ వన్టౌన్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు, ప్రొబేషనరీ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుళ్లు రాజారాం, నల్లగంతుల శ్రీను, వెంకటేశ్వర్లు, హుస్సేన్, వీరబాబు, నర్సింహా, ప్రసాద్ను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.