HomeNalgondaPlants Are Drying Up In Rural Nature Forests
ప్రగతి మొక్కల పట్టింపేది?
జిల్లాలో అటవీ శాతాన్ని పెంచాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో విరివిగా మొక్కలు నాటింది. సంరక్షణ లేకపోవడంతో అవి నేడు ఎండుదశలో ఉన్నాయి. ప్రధానంగా పల్లె ప్రకృతి వనాలతోపాటు బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కల్లో సింహభాగం ఎండుతున్నాయి.
పల్లె ప్రకృతి వనాల్లో ఎండుతున్న మొక్కలు
మా బాధ్యత తీరిందంటున్న డీఆర్డీఏ.. డబ్బుల్లేవంటున్న గ్రామ పంచాయతీలు
జిల్లాలో తొమ్మిది విడుతల్లో 7.80 కోట్ల మొక్కలు నాటిన గత సర్కార్
నల్లగొండ, మే 19 : జిల్లాలో అటవీ శాతాన్ని పెంచాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో విరివిగా మొక్కలు నాటింది. సంరక్షణ లేకపోవడంతో అవి నేడు ఎండుదశలో ఉన్నాయి. ప్రధానంగా పల్లె ప్రకృతి వనాలతోపాటు బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కల్లో సింహభాగం ఎండుతున్నాయి. రెండేండ్లపాటు వాటిని సంరక్షించిన గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం మా పీరియడ్ అయిపోయిందంటుండగా.. మా దగ్గర డబ్బుల్లేవని పంచాయతీ యంత్రాంగం చేతులెత్తేసింది. దాంతో పల్లె, బృహత్ ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. ఫలితంగా అటవీ శాతాన్ని పెంచేందుకు గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులా ఎండకు కరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా గ్రామ పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలను పరిరక్షించేందుకు ట్రాక్టర్లకు డీజిల్ లేక అప్పులు చేయాల్సి వస్తున్నదని పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏటా 70 లక్షలకు పైగా మొక్కల నాటింపు
నల్లగొండ జిల్లాలో ఐదు శాతం మాత్రమే అటవీ శాతం ఉండటంతో కేసీఆర్ ప్రభుత్వం ఏటా 70 లక్షలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చింది. 2014 ఆగస్టులో అప్పటి సీఎం కేసీఆర్ చిట్యాల మండలంలో మొక్క నాటి హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించగా.. నాటి నుంచి జిల్లాలో 7.80 కోట్ల మొక్కలు నాటుకున్నాయి. ప్రతి ఏడాది మొక్కల నాటింపు ఓ యుద్ధంలా జరిగింది. కానీ.. నేడు వాటి సంరక్షణపై సమీక్ష లేకపోవడంతో ఐదు నెలల నుంచి కనీస పర్యవేక్షణ, నీళ్లు పోసే నాధుడే లేకుండా పోయాడనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా ఈ వేసవిలో నీటికి కటకట ఏర్పడడంతో మొక్కలను వదిలేశారనే విమర్శలు ఉన్నాయి.
ఖజానా ఖాళీతో కార్యదర్శుల ఇబ్బందులు
గ్రామ పంచాయతీ కార్యదర్శులపై నిత్యం పని భారం పడుతుండటంతోపాటు ఖజానాలో నిధులు లేక ఇబ్బంది పడుతున్నారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల సంరక్షణ బాధ్యత డీఆర్డీఏది కాగా, ఈ ఏడాదితో పూర్తి కావడంతో వారు నిధులు ఇవ్వబోమని తేల్చారు. దీనికితోడు గ్రామాల్లో చెత్త ఏరివేతతోపాటు మొక్కల సంరక్షణకు ట్రాక్టర్లలో డీజిల్ లేక అప్పులు తెచ్చి పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాచర్లకు వంద మొక్కలకు నెలకు రూ.1800 మస్టర్ కింద వేతనం అందుతుండగా.. గరిష్ఠంగా 400 మొక్కల వరకు ఇస్తున్నారు. ట్రాక్టర్లకు మాత్రం టీఏలు, బిల్లులు చేయకపోవడంతో నిధులు వచ్చే పరిస్థితి లేక కార్యదర్శులే చేతి నుంచి చెల్లించాల్సి వస్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖ నిబంధనల ప్రకారం జిల్లాలో పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కల సంరక్షణ రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుందని డీఆర్డీఏ నాగిరెడ్డి తెలిపారు. ఆయా వనాల్లో మొక్కలు నాటి రెండేండ్లు పూర్తి అయినందున వాటి సంరక్షణ బాధ్యత ఇక గ్రామ పంచాయతీలదేనని చెప్పారు. అయితే.. మొక్కల సంరక్షణపై డీపీఓ మురళిని వివరణ కోరగా ఆయన అందుబాటులోకి రాలేదు.
వృథాగా వనాలు
జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటితోపాటు మరో 542 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. భూములు అందుబాటులో ఉన్న పెద్ద గ్రామాల్లో 65 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. గ్రామాల్లో ఎకరం నుంచి రెండెకరాలు, భూమి లేని ప్రాంతాల్లో అర ఎకరంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయగా.. పెద్ద గ్రామాల్లో పది ఎకరాలకు పైగా భూములు సేకరించి బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. ఇప్పుడు నీళ్లు లేక ఆ మొక్కలు ఎండుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎండి పోయిన పల్లె ప్రకృతి వనాలు
కొండమల్లేపల్లి, మే 15 : గత కేసీఆర్ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు మూడు నెలలుగా నిరాదరణకు గురవుతున్నాయి. కనీసం మొక్కలకు నీళ్లు పోసే వారు దిక్కులేకుండా పోవడంతో వనంలోని మొక్కలన్నీ ఎండిపోయాయి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండంలోని గన్యానాయక్తండా, దంజిలాల్ గ్రామాల్లో ఎకరం భూమిలో సుమారు రెండు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీళ్లు పోసేవారు లేక ఎండిపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పచ్చగా కళకళలాడిన వనాలు నేడు మోడువారి పోయాయి. మొక్కల సంరక్షణను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రస్తుతం వనంలోని మొక్కలు ఎండకు వాడిపోయి బోర్డులు మాత్రమే మిగిలాయి. సర్పంచుల పదవీకాలం పూర్తవడం, ప్రత్యేకాధికారులు పట్టించుకోక పోవడంతో బోర్లు పనిచేయక పోయినా, మోటర్లు కాలిపోయినా పట్టించుకునే వారు లేకుండా పోయారు. దాంతో మొక్కలకు మూడు నెలలుగా కనీసం నీళ్లు పోసే వారు లేకుండా పోయారు.