సూర్యాపేట, జూలై 26 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో బాధ్యతారహితమైన ప్రతిపక్షాలు ఉన్నాయని, ట్రెండింగ్ కోసమే అవగాహన లేమితో చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై మాట్లాడడానికి ఏమీ లేక సీఎం కేసీఆర్పై నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వ అప్పుల మీద పార్లమెంట్లో మాట్లాడకుండా రాష్ట్ర అప్పులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నాయకులను భయపెట్టాలని కేంద్రం చూస్తున్నదన్నారు. కానీ.. సీఎం కేసీఆర్ నిప్పులాంటి మనిషి అని, ఆయనను ముట్టుకోవడం ఎవరి వల్లా కాదని పేర్కొన్నారు. కేసీఆర్ జోలికి వస్తే బీజేపీ నాయకుల చిట్టా విప్పుతామని హెచ్చరించారు.
విలీన గ్రామాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి
ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో కలిపిన విలీన గ్రామాల ప్రజల మనోభావాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని మంత్రి అన్నారు. ఏడు మండలాలను బీజేపీ కుట్రతో ఆంధ్రాలో విలీనం చేసిందని విమర్శించారు. అక్కడి ప్రజలు రెండు రాష్ర్టాల అభివృద్ధిని బేరీజు వేసుకుంటున్నారని, భౌగోళికంగా ఉన్న ప్రజల అభ్యంతరాలపై ఆలోచించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, భద్రాచలంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. కాళేశ్వరం ఎక్కడుందో, భద్రాచలం ఎక్కడుందో తెలియకుండా ఆయన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వరద నీటితో ప్రాజెక్టు పైభాగం మునుగుతుందో.. కింది భాగం మునుగుతుందో అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సూర్యాపేట టౌన్ : రాష్ట్రంలో రాజకీయాలకతీతంగా వివక్ష చూపని పాలన కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా 115 మంది బాధిత కుటుంబాలకు సుమారు రూ.55.29 లక్షల విలువైలన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల బాధలెరిగిన నాయకుడిగా సీఎం కేసీఆర్ వారికి అండగా నిలుస్తున్నారని, అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు తమ సొంత కుటుంబంగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలన దార్శనికతకు పెట్టింది పేరు అని, ఉమ్మడి రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు చూశామని, పోరాడి సాధించిన రాష్ట్రంలో వాటిని పూర్తిగా రూపుమాపుకున్నామన్నారు. కేవలం ఎనిమిదేండ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించుకున్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఎంపీపీలు బీరవోలు రవీందర్రెడ్డి, కుమారీబాబు, మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, జడ్పీటీసీలు జీడి భిక్షం, మామిడి అనితాఅంజయ్య, సంజీవనాయక్, టీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు సవరాల సత్యనారాయణ, జూలకంటి జీవన్రెడ్డి, వంగాల శ్రీనివాస్రెడ్డి, తూడి నర్సింహారావు, దొంగరి యుగంధర్, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
బోటింగ్ ట్రయల్ రన్ చేసిన మంత్రి..
ఇప్పటికే రెండు ట్యాంక్బండ్లు, మెడికల్ కళాశాల, పార్కులు, రోడ్ల విస్తరణతో సుందరంగా మారుతున్న సూర్యాపేటకు మరో సరికొత్త అందం తోడుకానున్నది. మంత్రి ప్రత్యేక చొరవతో సద్దుల చెరువులో బోటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. చిన్నారులు, యువతకు వినోదాన్ని పంచనున్నాయి.
మంగళవారం మంత్రి జగదీశ్రెడ్డి బోటింగ్ ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. ప్రత్యేక బోట్లో సద్దుల చెరువులో విహరించి సందడి చేశారు. త్వరలో బోటింగ్ ప్రారంభం కానుండటంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.