పెద్దగట్టులో మూడోరోజూ జనం జాతర మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ 5లక్షల మందికిపైగా భక్తులు లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. గట్టుపైన, కింద పరిసరాల్లో ఎటుచూసినా జనమే కనిపించారు.యాదవ పూజారులు మూడోరోజు సంప్రదాయ పద్ధతిలో గుడి ముందు చంద్రపట్నం వేసి, దేవతామూర్తులకు పూజలు చేశారు. సూర్యాపేట డివిజన్లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో పిల్లలు ఎగ్జిబిషన్కు వచ్చి సందడి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఇబ్బందుల్లేకుండా జాతరను సజావుగా నడిపిస్తున్నాయి.
– సూర్యాపేట, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ)
పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర మూడో రోజు కూడా వివిధ ప్రాంతాల నుంచి భక్తుల అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సూర్యాపేట, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో గుట్టపైన, కింద రద్దీ కనిపించింది. ఉదయం నుంచి 11 గంటలకు వరకు జనం పెద్దగా కనిపించక పోయినప్పటికీ ఆ తర్వాత రద్దీ పెరిగింది. అయినప్పటికీ అధికారులు తీసుకుంటున్న చర్యలతో భక్తులు ఇబ్బందులు లేకుండా మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో జోరుగా వ్యాపారాలు సాగాయి.
– బొడ్రాయిబజార్/చివ్వెంల, ఫిబ్రవరి 7
ఎగ్జిబిషన్పై యువత ఆసక్తి
జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్పై యువత, చిన్నారులు ఆసక్తి కనబర్చారు. ముఖ్యంగా జెయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్స్, చిన్నారుల డ్రాగన్ రైలులో ఎక్కి ఎంజాయ్ చేశారు.
సరదాగా సెల్ఫీలు
గుట్టపై పలువురు ఫొటోగ్రాఫర్లు ఫ్ల్లెక్సీలను ఏర్పాటు చేసి భక్తులను ఫొటో దింపి వెంటనే ప్రింట్ ఇచ్చారు. కుటుంబ సభ్యులతో వచ్చిన వారు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. అయితే ఒక్కో ఫొటోకు ఒక్కో రేటు పెట్టిన ఫొటో గ్రాఫర్లు భక్తుల ఆసక్తి మేరకు ఫొటోలు దింపారు. మరికొందరు తమ సెల్ఫోన్లతోనే సెల్ఫీలు దిగుతూ సరదాగా గడపడం కనిపించింది.
స్మోక్ బిస్కెట్
జాతరలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్మోక్ బిస్కెట్ భక్తులను ఆకట్టుకుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా స్మోక్ బిస్కెట్ తింటూ ముక్కు, నోరు నుంచి స్మోక్ వదులుతూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం కనిపించింది. ఒక్కో బిస్కెట్ ధర రూ. 50 ఉన్నప్పటికీ భక్తులు ఆసక్తి కనబర్చారు.
శానిటేషన్పై ప్రత్యేక దృష్టి
మూడు రోజులుగా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న పెద్దగట్టుపై అపరిశుభ్ర వాతావరణం నెలకొనకుండా అధికారులు ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టారు. గుట్ట నలుమూలల బ్లీచింగ్ పౌడర్ను చల్లడం, దుకాణాలు, నడక దారిలో దుమ్ము లేవకుండా వాటర్ ట్యాంకర్తో నీళ్లు చల్లారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేశారు. మూడు షిప్టులతో సుమారు వెయ్యి మంది సిబ్బందిని నియమించి చెత్తను తొలగిస్తున్నారు. మర్రిచెట్టు వద్ద మున్సిపాల్టీ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు కూడా అందిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి పారిశుధ్యం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
జాతకంపై ఆసక్తి
కొంత మంది శివస్వాములు, శివసత్తులు ఆలయ పరిసరాల్లో ఉండి జాతరకు వచ్చిన భక్తులకు జాతకాలు చెప్పారు. తమ భవిష్యత్తు గురించి చెప్పించుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. ఇంట్లో కష్టం ఎందుకొచ్చింది పరిష్కారంగా ఏమి చేయాలో చెబుతూ వారు భక్తులను ఆకట్టుకున్నారు. అయితే వారు చెప్పిన దానికి తలాడించడం భక్తుల వంతైంది.
నేడు నెలవారం
బొడ్రాయిబజార్/ చివ్వెంల : పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరలో భాగంగా బుధవారం నెలవారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మెంతబోయిన వంశీయులంతా తమ గ్రామ దేవర గుడి నుంచి మందగంప, కొత్త కుండలు, గొర్రెను తీసుకొని ఊరేగింపుగా పెద్దగట్టుకు చేరుకొని నెలవారం నిర్వహిస్తారు. బోనాలు వండి పసుపు, కుంకుమ, బంతిపూలతో అలంకరించి లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకు వస్తారు. ముందుగా లింగమంతులస్వామికి తరువాత సౌడమ్మ తల్లికి నైవేద్యం సమర్పిస్తారు.
స్వామివారిని దర్శించుకున్న నాయకులు
పెద్ద గట్టు లింగమంతుల స్వామిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో జాతరకు భక్తులు హాజరవుతున్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించారని ఆయన అన్నారు.
తీపిని పంచిన మిఠాయిలు
జాతరలో పలు మిఠాయిల దుకాణాలు వెలిశాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అధికంగా మిఠాయిల కొనుగోలుకు ఆసక్తి కనబర్చారు. ముఖ్యంగా చిలకలు, బత్తాసులు వంటివి కొనుగోలు చేశారు. తాము ఇంటికి వెళ్లి చుట్టుపక్కల వారికి ప్రసాదం పంచేందుకు వీలుగా మిఠాయి, చిలకలను కొనుగోలు చేస్తుంటారు.
అప్పుడు మర్రిచెట్టు కింద మాత్రమే నీడ ఉండేది
నేను 30 జాతర్లకు పైగా చూసిన. నేను చిన్నప్పటి నుంచి జాతరకు వస్తున్న. అప్పుడు ఆలయం వద్ద ఉన్న మర్రి చెట్టు కింద మాత్రమే నీడ ఉండేది. దర్శనం అనంతరం ఎవరైనా సరే చెట్టు కిందకు వెళ్లి సేదతీరేవారు. ఇప్పుడు గుట్ట చుట్టూ చలువ పందిళ్లు వేశారు. నీళ్ల వసతి చాలా బాగుంది.
– బొమ్మ కొమరమ్మ, నర్సిహాపురం
తిరునాళ్లలో వసతులు బాగున్నాయి
నేను లింగన్నను దర్శించుకునేందుకు ప్రతి జాతరకు వస్తుంటాను. ఇప్పుడున్న సౌకర్యాలు గతంలో లేనే లేవు. నాడు మంచినీళ్లకోసం ఇబ్బందులు పడ్డాం. ఎడ్లబండ్లపై డ్రమ్ముల్లో నీరు, సామాన్లు పెట్టుకొని మేము నడుచుకుంటూ వచ్చేవాళ్లం. ఇప్పుడు ట్రాక్టర్లో సామాన్లు మాత్రమే తీసుకొని వస్తున్నాం. ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది కాలేదు. నీటి వసతి బాగున్నది.
– హలావత్ మంగ్యా, ఉర్లుగొండ
ప్రశాంతంగా దేవుడిని దర్శించుకున్న
పెద్దగట్టు లింగమంతులస్వామి శక్తివంతమైన దేవుడు. ప్రతి జాతరకు కుటుంబంతో కలిసి వచ్చి పండుగ చేసుకుంటున్నాం. ప్రస్తుతం జాతరలో ఏర్పాట్లు చాలా బాగా చేశారు. తాగునీరు, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భక్తులకు ఇబ్బందులు కలుగడం లేదు. దర్శనం కోసం ఎండలో నిలబడకుండా పందిళ్లు వేశారు. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా దేవుడిని దర్శించుకున్నాను.
– బొడ్డుపల్లి యాదగిరి, నూతనకల్
ప్రతి జాతరలోనూ విధులు
నేను ప్రస్తుతం డీఎస్పీగా పని చేస్తున్నాను. 11 జాతరలకు ఎస్ఐగా, సీఐగా, డీఎస్పీగా విధులు నిర్వహించాను. నాటికి నేటికీ పెద్దగట్టు రూపు రేఖలు మారిపోయాయి. ప్రస్తుతం భక్తులకు ఇబ్బందులు లేవు. గుట్ట చుట్టూ రోడ్లు అందుబాటులోకి తేవడంతో భక్తులు గట్టుపైకి సులువుగా వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. దాంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడింది. మూడు రోజులుగా జరుగుతున్న జాతరలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసు యంత్రాంగం కలిసి కట్టుగా పని చేస్తున్నాం.
-రవి, డీసీఆర్బీ డీఎస్పీ, సూర్యాపేట