మిర్యాలగూడ/ అడవిదేవులపల్లి, మార్చి 31 : యావత్ భారతదేశం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని, తెలంగాణాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆయన ద్వారానే తమకు అందుతాయని నమ్ముతున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. అడవిదేవులపల్లి మండలం సత్రశాల వద్ద మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు అందించాలని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతులను అప్పుల ఊబి నుంచి బయట పడేశాయని, ఈ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేస్తే అన్నదాతలు ఆర్థికంగా బలోపేతం చెందుతారనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని తెలిపారు.
మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల ప్రజలు, రైతులు తెలంగాణ పథకాలకు ఆకర్షితులవుతున్నారన్నారు. ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు లక్షలాది మంది రైతులు తరలివచ్చి సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు. గిరిజనులకు 6శాతం ఉన్న రిజర్వేషన్లను 10శాతానికి పెంచిన ఘనత మన ముఖ్యంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రజల మనస్సును చూరగొన్న సీఎం కేసీఆర్ను ఇబ్బందులు పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐల ద్వారా కేసులు పెడుతున్నదని విమర్శించారు. ఓ వైపు ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరిస్తున్న కేంద్రం.. మరోవైపు నిత్యావసర ధరలను పెంచి సామాన్యులపై పెను భారం మోపుతున్నదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోవద్దని, మరోసారి బీఆర్ఎస్ను గెలిపించేందుకు సైనికుల్లా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతంగా ఉన్న అడవిదేవులపల్లిని తన విజ్ఞప్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ మండలం చేశారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గతంలో తాసీల్దార్, పోలీస్స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్లాలంటే మండలంలోని ప్రజలు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని తెలిపారు. మండలంలో ఈ నాలుగేండ్లలో రూ.437కోట్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించామని చెప్పారు. ఈ ప్రాంతంలో రైతుల కష్టాలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ మూడు లిఫ్టులను నిర్మించేందుకు రూ.570 కోట్లు మంజూరు చేశారని, పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.
ఈ లిఫ్టులతో రెండు మండలాల పరిధిలో సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.వ వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న బీఆర్ఎస్ సర్కార్కు, సీఎం కేసీఆర్కు ప్రజలందరూ అండగా నిలువాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించి బీఆర్ఎస్ పార్టీని మూడో సారి గెలిపించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్, జడ్పీటీసీ సేవ్యానాయక్, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల చినరామయ్య, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు సూర్యనాయక్, మాజీ ఎంపీపీ కూరాకుల మంగమ్మ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొత్త మర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.