ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ చందమామ అడుగు పెట్టి దేశసత్తాను ప్రపంపవ్యాప్తం చేసిన వేళ.. ఆ మిషన్లో పనిచేసిన వారిలో యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూర్ గ్రామ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ ఉద్యోగుల శ్రమ చరిత్రలో నిలిచిపోనున్నది. ఇస్రో షార్క్ వర్స్ షాపులో 350 మంది పీఈఎల్ ఉద్యోగులు శ్రమించి చంద్రయాన్-3 విక్రం ల్యాండర్లో ఉపయోగించిన జీఎస్ఎల్వీ మార్క్-3లో ఎస్-200 బూస్టర్ను తయారు చేసి, విక్రమ్ ల్యాండర్ను చందమామ వైపు వెళ్లే విధంగా శ్రమించారు. ఇస్రోకు ప్రైవేట్ పార్టనర్షిప్గా ఉన్న పీఈఎల్ కంపెనీ పీఎస్ఎల్వీకు కావాల్సిన పీఎస్ఓఎం ఎక్సైల్ ను తయారు చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు. డీఆర్డీఏ, ఇస్రో గుర్తింపు కంపెనీగా నిలిచిన పీఈఎల్ త్వరలో ఇస్రోకు శాశ్వత పీఎస్ఎల్వీకి పీఎస్ఓఎం ఎక్సైల్ను తయారు చేసే అందించే ఖాతాల్లో వెళ్లనుంది. చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ కావడంతో పెద్దకందుకూరు పీఈఎల్ కంపెనీలో ఉద్యోగులు సంబురాలు నిర్వహించారు.
యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు గ్రామానికి చెందిన ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ లిమిటెడ్కు గొప్ప చరిత్ర ఉంది. 1985లో పెద్దకందుకూర్లో స్థాపించి మొదటగా మైనింగ్కు వినియోగించే పేలుడు పదార్థాలను తయారు చేసేవారు. కాలక్రమేపీ ఇస్రో, డీఆర్డీఏకు కావాల్సిన సాలిడ్ బూస్టర్లను అందించింది. 2007లో ఇస్రో చేసిన ఎన్నో ప్రయోగాలకు సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్ను అందించిందని పీఈఎల్ కంపెనీ అధికారులు వెల్లడించారు. ఇస్రో రాకెట్ మోటారులో వినియోగించే సాలిడ్ ప్రొపలెంట్, డీఆర్డీఓలో మిస్సైల్స్కు వినియోగించే సాలిడ్ బూస్టర్స్లను తయారీలో పీఈఎల్ కంపెనీ అర్హత పొందింది. డీఆర్డీఓ, ఇస్రో ద్వారా గుర్తించబడింది.
పీఎస్ఎల్వీ రాకెట్ మోటర్లో ఎస్-200 బదులుగా పీఎస్ఓఎం ఎక్సైల్ వినియోగిస్తారు. ఈ పీఎస్ఓఎం ఎక్సైల్ను పీఈఎల్ కంపెనీ ఉద్యోగులు కొన్నిరోజులు శ్రీహరికోటలోనే తయారు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఉన్న అనుభవాన్ని గుర్తించిన శ్రీహరికోట సైంటిస్టులు పీఎస్ఓఎం ఎక్సైల్ను తయారు చేసేందుకు పూర్తిస్థాయిలో అనుమతినిచ్చారు. దాంతో ఈ పీఎస్ఓఎం ఎక్సైల్ను మోటకొండూర్ మండలంలోని కాటేపల్లిలో ఉన్న కంపెనీలో తయారు చేస్తున్నారు. మొదటగా 6 పీఎస్ఎల్వీకు కావాల్సిన పీఎస్ఓఎం ఎక్సైల్ అర్డరు ఇచ్చారు. ఈ 6 మోటర్లలో మొదటగా లాంచీంగ్ ముందుగా గ్రౌండ్ పరీక్షలు నిర్వహించి వాటి నుంచి వచ్చే శక్తి, ఒత్తిడి పరిశీలించి పూర్తిస్థాయిలో అవగాహనకు వచ్చిన తరువాతే లాంచ్కు వినియోగించనున్నారు. ఇందులో 3 మోటార్లకు సంబంధించిన పీఎస్ఓఎం ఎక్సైల్ను శ్రీహరికోటను అందజేశారు. మరో 3 మోటర్లను డిసెంబర్లోగా అందజేయనున్నారు. తొలుతగా పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగంలో పీఎస్ఓఎం ఎక్సైల్ను వినియోగిస్తారు. లాంచ్లో అర్హత పొందితే పూర్తిస్థాయిలో పీఎస్ఎల్వీకి పీఎస్ఓఎం ఎక్సైల్ను పీఈఎల్ కంపెనీ సరఫరా చేయాల్సి ఉంటుంది. పీఎస్ఎస్వీలో ఒక లాంచ్లో పీఈఎల్ అర్హత పొందితే 100 శాతం సరఫరా చేసే మొదటగా నిలువనున్నది.
పెద్దకందుకూరు గ్రామానికి చెందిన ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ కంపెనీకి సాలిడ్ ప్రొపలెంట్ బూస్టర్ను అందించింది. ఇస్రోకు ప్రైవేట్ పార్టనర్షిప్గా పీఈఎల్ కంపెనీ సుమారు 18 ఏండ్లుగా కలిసి పనిచేస్తున్నది. ఇస్రోలోని షార్క్ వర్క్ సెంటర్లో పీఈఎల్ ఎంపిక చేసిన దాదాపుగా 10 ఏండ్లకు పైగా 350 వరకు మంది ఉద్యోగులు వివిధ హోదాలో పనిచేస్తున్నారు. ఇస్రోకు కావాల్సిన సాలిడ్ బూస్టర్స్ను పీఈఎల్ ఉద్యోగులే తయారు చేస్తున్నారు. గత బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపైన అడుగు పెట్టిన చంద్రయాన్-3 విక్రం ల్యాండర్లో ఉపయోగించిన జీఎస్ఎల్వీ మార్క్-3 లో ఎస్-200 బూస్టర్ను వినియోగించారు. ఈ ఎస్-200 తయారీలో పీఈఎల్ కంపెనీ ఉద్యోగుల పాత్ర కీలకంగా మారింది. ఎస్-200ను మెయిన్ రాకెట్ మోటార్ లాంచ్ చేసే సమయంలో వచ్చే సాలిడ్ ప్రొపలెంట్ లో పీఈఎల్ కంపెనీ ఉద్యోగులకు విశేష అనుభవంతో పాటు అవగాహన ఉంది. దీంతో శ్రీహరికోటలో వర్క్సెంటర్లో సాలిడ్ ప్రొపలెంట్ తయారీలో పీఈఎల్ ఉద్యోగులను ఇస్రో సైంటిస్టులు ఉపయోగించారు. ఇస్రోలో వినియోగించే సాలిడ్ ప్రొపలెంట్లో తయారీలో మిగతా కాంట్రాక్టుల కంటే పీఈఎల్ ఒక్కటే అర్హత సాధించింది.
సుదీర్ఘ అనుభవం, నైపుణ్యం పొందిన 350 మంది మా సంస్థ ఉద్యోగులు చంద్రయాన్-3లో పాలు పంచుకున్నారు. ప్రధానంగా రాకెట్ లాంచర్ను కక్షవైపు పంపేందుకు వాడే ఎస్-200 ప్రొపలెంట్ బూస్టర్స్ను తమ ఉద్యోగుల శ్రమించి తయారు చేసి, ఇస్రోకు అందించారు. చంద్రయాన్-3 విజయవంతం కావడంతో మాకు మరింత బాధ్యత పెరిగింది.
– దుర్గ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్, పీఈఎల్, పెద్దకందుకూరు