రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్) చైర్మన్లకు వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రెండు దశాబ్దాలుగా ఈ డిమాండ్ గత ప్రభుత్వాల ముందున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఏడాది కిందట సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో వేతన పెంపు సాకారమైంది. ఈ నెల నుంచే అన్ని పీఎసీఎస్ల చైర్మన్ల వేతనాలు పెంచాలని సహకార శాఖకు అందాయి. సొసైటీల టర్నోవర్ను బట్టి డీసీసీబీ వేతనాలను పెంచి, ఈ నెల నుంచే అందించనున్నది. చిన్న సొసైటీల వేతనాలు రూ.300 నుంచి రూ.5వేల వరకు, పెద్ద సొసైటీలైతే రూ.1250 నుంచి రూ.15వేల దాకా పెంపు ఉండనున్నది. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పీఏసీఎస్లు స్వరాష్ట్రంలో ఆర్థికంగా బలోపేతమవడం, తాజాగా చైర్మన్ల వేతనాల
పెంపు సాధ్యమవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నల్లగొండ, జనవరి 9 : రైతు సంక్షేమం కోసం పాటు పడే ప్రాథమికర సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్లకు వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రెండు దశాబ్దాలుగా వేతనాలు పెంచాలని వేడుకున్నప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఏడాది క్రితం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఈ నెల నుంచి వేతనాలు పెంచాలని సహకార శాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 107 పీఏసీఎస్సలు ఉండగా ఆయా సొసైటీల చైర్మన్లకు కొత్త వేతనాలు అందనున్నాయి.
సహకార సొసైటీలు పాలక వర్గాల పరిధిలో ఉంటాయి. ప్రతి సొసైటీలో 13 మంది డైరెక్టర్లను ఆ సొసైటీల్లో సభ్యులుగా ఉన్న రైతులు ఓటు వేసి ఎన్నుకోగా వారు ఒక చైర్మన్ను ఎన్నుకుంటారు. డైరెక్టర్ల ద్వారా ఎన్నుకున్న ఈ చైర్మన్ పరిధిలోనే ఆ సహకార సొసైటీ ముందుకు సాగుతుంది. ఆయన ఆధ్వర్యంలోనే రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, డిపాజిట్లు, ధాన్యం కొనుగోళ్లతో పాటు ఇతర రైతు సంక్షేమ కార్యక్రమాలు నడుస్తుంటాయి. అయితే ఈ పాలక వర్గంలో ప్రథముడైన చైర్మన్కు రెండు దశాబ్దాలుగా వేతనాలు పెంచలేదు. అప్పటి నుంచి పీఏసీఎస్లను బలోపేతం చేసి వేతనాలు పెంచాలని పాలకులను వేడుకున్నా పట్టించుకోకపోవడంతో వారు ఎన్నో ఆందోళనలు చేపట్టారు. ఇటీవల సీఎం కేసీఆర్ అన్ని సహకార సొసైటీలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న క్రమంలో తమ వేతనాలు పెంచాలని కోరగా, ఆయన వేతనాలు పెంచాలని ఆదేశించిన నేపథ్యంలో ఆయా పీఏసీఎస్ల టర్నోవర్ను బట్టి పెంచుతూ ఈ నెల నుంచే అమలు చేయాలని డీసీసీబీలను ఆదేశించారు.
2014కు ముందు ప్రాథమిక సహకార సొసైటీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. ప్రస్తుతం రూ.10 నుంచి 20 కోట్ల టర్నోవర్తో దూసుకెళ్తున్న పీఏసీఎస్లకు కూడా ఒక్కో సీజన్లో పంట రుణాల కోసం రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలు మాత్రమే ఇస్తుండగా ప్రస్తుతం ఆ సొసైటీలకు సీజన్కు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఇస్తుండటంతో ఆయా సొసైటీలు ఆర్థికంగా పుంజుకొని లాభాల్లో నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిదేండ్ల కింద 500-600 కోట్ల టర్నోవర్తో సహకార శాఖ ఉండగా, నేడు 2 వేల కోట్ల టర్నోవర్ దాటి ముందుకు దూసుకెళ్తున్నాయి. నాడు గరిష్ఠంగా కొన్ని పీఏసీఎస్లు కోటి, రెండు కోట్ల టర్నోవర్తో నడుస్తుండగా నేడు రూ.కోట్లకు పైగా టర్నోవర్తో ఉమ్మడి జిల్లాలో 15 సొసైటీలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పలు పథకాల అమలుతోపాటు వ్యాపార మార్గాలు సూచించి నిధులను సమకూర్చుతున్న నేపథ్యంలో ఈ టర్నోవర్ గణనీయంగా పెరిగిందని ఆయా పీఏసీఎస్ల చైర్మన్లు చెబుతున్నారు.
ప్రాథమిక సహకార సొసైటీల చైర్మన్ల వేతనాలు పెంచాలని సీఎం ఆదేశానుసారం రాష్ట్ర సహకార శాఖ ఆయా జిల్లా కేంద్ర బ్యాంక్ పాలక వర్గాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా నిర్ణయం తీసుకొని ఈ నెల నుంచే పెంచాలని ఆయా పీఏసీఎస్ల సీఈఓలను ఆదేశించింది. గతంలో రూ.20 లక్షల టర్నోవర్ ఉన్న పీఏసీఎస్ చైర్మన్లకు రూ.300 వేతనం ఇవ్వగా రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల టర్నోవర్ ఉన్న వారికి రూ.500, రూ.50 లక్షల నుంచి రూ.కోటి ఉన్న వారికి రూ.600, రూ.కోటి నుంచి రూ.2కోట్లు ఉన్న వారికి రూ.1000, రూ.2 కోట్ల టర్నోవర్కు పైగా ఉన్న వారికి గరిష్ఠంగా రూ.1250 చొప్పున వేతనం అందజేశారు.
అయితే స్వరాష్ట్రంలో పీఏసీఎస్లకు ఊహించని స్థాయిలో నిదులిచ్చి అభివృద్ధి చేసిన ప్రభుత్వం అంతే స్థాయిలో వేతనాలు కూడా పెంచింది. ఈ క్రమంలో ఈ నెల నుంచి రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న పీఏసీఎస్లకు రూ.5 వేలు ఇవ్వనుండగా, రూ.5కోట్ల నుంచి రూ.పది కోట్ల టర్నోవర్ ఉన్న వారికి రూ.7,500, రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఉన్న వారికి రూ.10 వేలు, రూ.15 నుంచి రూ.25 కోట్ల వారికి రూ.12,500, రూ.25 కోట్ల టర్నోవర్ పైగా ఉన్న పీఏసీఎస్ చైర్మన్లకు రూ.15 వేల వేతనం ఇవ్వాలని సహకార శాఖ జీఓ జారి చేసింది.