అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితా వెల్లడైంది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్క్రూటినీ అనంతరం
మిగిలిన 355 మంది అభ్యర్థుల్లో మొత్తం 79 మంది తాము పోటీ నుంచి తప్పుకొంటున్నామంటూ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దాంతో మొత్తం 276 మంది తుది పోరుకు సిద్ధమయ్యారు. తుది జాబితా ప్రకారం మునుగోడులో అత్యధికంగా 39 మంది, అతి తక్కువగా దేవరకొండలో 13 మంది పోటీలో ఉన్నారు.
అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఒకటి కంటే ఎక్కువ ఈవీఎంలను వినియోగించాల్సి ఉంటుంది. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థులకే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్నిచోట్ల అదనపు ఈవీఎంలు తప్పవు. ఇక సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పటేల్ రమేశ్రెడ్డి నామినేషన్ ఉపసంహరణ తీవ్ర గందరగోళానికి దారితీసింది. వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. నేటి నుంచి ప్రచారం మరింత హోరెత్తనున్నది. ప్రచారానికి మరో 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
నల్లగొండ ప్రతినిధి, నవంబర్15(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 10 తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణలో మొత్తం 428 మంది అభ్యర్థ్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనలో ఇందులో నుంచి 73 మంది నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా 355 మంది బరిలో మిగిలారు. ఇందులో పోటీ నుంచి తప్పుకోవడానికి ఉపసంహరణ గడువు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగిసింది. రెండు రోజుల్లో కలిపి మొత్తం 79 మంది నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. దాంతో మొత్తం 276 మంది బరిలో నిలిచినైట్లెంది. మునుగోడులో అత్యధికంగా 39 మంది బరిలో నిలువగా తర్వాత వరుసగా కోదాడలో 34 మంది, నల్లగొండలో 31, హుజూర్నగర్లో 24, నకిరేకల్ 23, మిర్యాలగూడ 23, ఆలేరు 21, సూర్యాపేట 20, భువనగిరి 19, నాగార్జునసాగర్ 15, తుంగతుర్తి 14, దేవరకొండలో 13 మంది అభ్యర్ధులు తుది పోరుకు సిద్ధమయ్యారు.
అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల అదనపు ఈవీఎంలు వినియోగించాల్సిందే. ఒక్కో ఈవీఎంలో నోటాతో కలిపి 16 మంది అభ్యర్థ్ధులకు మాత్రమే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే దేవరకొండ, తుంగతుర్తి, నాగార్జునసాగర్లలో మాత్రమే ఒక్కో ఈవీఎంతోనే పోలింగ్ జరుగనుంది. భువనగిరి, సూర్యాపేట, ఆలేరు, నకిరేకల్, మిర్యాలగూడ, హుజూర్నగర్, నల్లగొండల్లో రెండు ఈవీఎంలను వాడాల్సి ఉంటుంది. కోదా డ, మునుగోడుల్లో మాత్రం మూడు ఈవీఎంలను విని యోగించాల్సిందే. అయితే ఒకటి కంటే ఎ క్కువ ఈవీఎంలు ఉంటే ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు.