యాదగిరిగుట్ట, జనవరి 30 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట (పూర్వగిరి) లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో 2023 వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. ఆలయ ప్రధానార్చకులు స్వస్తీవాచనం, పుణ్యాహవాచనం, రక్షాబంధనం కార్యక్రమాలతో ఉత్సవాలను ప్రారంభించనున్నారు. మంగళవారం మాఘ శుద్ధ మాసం నుంచి ఫిబ్రవరి 6వ తేదీ మాఘ బహుళ పాడ్యమి వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ఫిబ్రవరి 2న ఎదుర్కోలు, 3న స్వామివారి తిరు కల్యాణోత్సవం, 4న విమాన రథోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. స్వామివారి తిరు కల్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొనేందుకు వీలుగా కల్యాణ టికెట్టు రూ.600 నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఫిబ్రవరి 4న రాత్రి 8గంటలకు దివ్యవిమాన రథోత్సవాన్ని పాతగుట్ట ఆలయం ముందు భాగం నుంచి స్వామివారి కల్యాణ మండపం వరకు ఊరేగిస్తామని తెలిపారు. 6వ తేదీన స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పాతగుట్టలో భక్తులతో జరిపించే నిత్యకల్యా ణం, హోమాలు రద్దు చేస్తున్నట్లు వివరించారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసి, లైటింగ్ ఏర్పాటు చేశారు. రంగులు వేయించారు. వారం రోజులపాటు జరిగే ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఆలయంలో తాత్కాలిక విద్యుద్దీపాలతో అలంకరించారు. చలువ పందిళ్ల్లు ఏర్పాటు చేశారు. పాతగుట్ట చౌరస్తా నుంచి ఆలయం వరకు రోడ్డుకు ఇరువైపులా విద్యుద్దీపాలతో కూడిన హోర్డింగ్లను అమర్చారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా పాతగుట్ట ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు స్వామివారి లడ్డూ, పులిహోర ప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు.
మూడ్రోజుల పాటు అలంకార సేవలు
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 2, 3, 4వ తేదీల్లో స్వామివారిని వివిధ వాహనాలపై అలకంరించి సేవలను పాతగుట్ట ఆలయం ముందు భాగం నుంచి స్వామివారి కల్యాణ మండపం వరకు ఊరేగిస్తారు. 2వ తేదీ ఉదయం సింహవాహన అలంకార సేవ, రాత్రి అశ్వవాహనంపై స్వామివారి ఎదుర్కోలు నిర్వహించనున్నారు. 3న ఉదయం హనుమంత వాహన అలంకార సేవ, రాత్రికి గజ వాహనంపై స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం నిర్వహిస్తారు. 4న ఉదయం గరుఢ వాహన సేవను నిర్వహించనున్నారు. అలంకార వేడుకల్లో వినియోగించే సేవ పల్లకీలు, బెంచీలను, రథాన్ని కొత్త రంగులతో తీర్చిదిద్దారు. స్వామివారికి కల్యాణం, ఎదుర్కోలు, రథోత్సవం, ఊరేగింపులో వినియోగించే సింహవాహనం, అశ్వవాహనం, హనుమంత వాహనం, గజవాహనం, గరుఢ వాహనాలను ఆలయ అధికారులు సిద్ధం చేశారు. స్వామి, అమ్మవార్లను రోజుకో వాహనంపై ఊరేగిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.
వారంపాటు ఆర్జిత సేవలు రద్దు
పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ఫిబ్రవరి 6వరకు స్వామివారికి భక్తులతో జరుపబడే నిత్య తిరుకల్యాణోత్సవం, మొక్కు కల్యాణోత్సవాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. 4న రథోత్సవం సందర్భంగా రాత్రి వేళల్లో అర్చనలు, శతనామార్చనలు, భోగాలు, 5న చక్రతీర్థం సందర్భంగా అభిషేకం, అర్చనలు, 6న అష్టోత్తర శతఘటాభిషేకం సందర్భంగా అభిషేకాలు, అర్చనలు రద్దు చేస్తున్నామన్నారు. శత ఘటాభిషేకంలో పాల్గొనే భక్తులు రూ.250 చెల్లించాల్సి ఉంటుందని, ఒక టికెట్పై ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని వెల్లడించారు.