నల్లగొండ సిటీ, డిసెంబర్ 09 : గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని పోలింగ్ అధికారులకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం కనగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్సులను ఆమె పరిశీలించారు. అలాగే సాయిరాం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సందర్శించి అక్కడ కావాల్సిన పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామగ్రిని పోలింగ్ కేంద్రం వారిగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. ఓటరు జాబితా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలన్నారు. బ్యాలెట్ బాక్స్ లు అన్ని ఓపెన్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలని, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకుని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు.
సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించాలన్నారు. చివరిగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగా బస్సులను పంపించాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలన్నారు. త్రాగునీరు, మూత్రశాలలు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాలు, వచ్చిపోయే దారుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట డీపీఓ వెంకయ్య, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, తాసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేద రక్షిత, ఎంఈఓ పద్మ ఉన్నారు.