సూర్యాపేట, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం కనిపించకపోయినా.. కనీసం దరఖాస్తుల డాటా ఎంట్రీకి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వలేదు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 475 గ్రామపంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో 3,62,203 దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో ఆరు రోజుల వ్యవధిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ ఆపరేటర్లను అంతా కలిపి సుమారు 1,350 మందితో రేయింబవళ్లు పని చేయించారు.
ఒక్కో దరఖాస్తు ఆన్లైన్ చేసినందుకుగాను కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7, ప్రైవేట్ ఆపరేటర్లకు రూ.15 చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. దాదాపు రూ.32 లక్షల బకాయి ఉన్నట్లు తెలిసింది. నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఆ డబ్బులు విడుదల చేయకపోవడంతో ఎదురుచూపులు తప్పడం లేదు.రాష్ట్రంలోని దాదాపు అన్ని కుటుంబాలు, వారి ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి వివరాలను కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించింది. దాని ద్వారానే దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను నాటి ప్రభుత్వం చేపట్టింది. అయితే గత ఎన్నికల్లో గెలిచి కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసిన విషయం విదితమే.
అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసేందుకు కుటుంబాల వివరాలు ఉన్నప్పటికీ కాలయాపన కోసం ప్రజాపాలన అంటూ కార్యక్రమం చేపట్టి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా పరిధిలోని 23 మండలాలు, 475 గ్రామపంచాయతీలు, 5 మున్సిపాలిటీల నుంచి 3,62,203 దరఖాస్తులను స్వీకరించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ జనం నుంచి తీసుకున్న దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు ప్రత్యేకంగా ఆపరేటర్లను నియమించారు. కానీ.. వారికి చెల్లించాల్సిన దాదాపు 32 లక్షల రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదు.
ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ చేసినందుకు గాను ప్రతి దరఖాస్తుకు ప్రైవేట్ వారితో చేయిస్తే రూ.15, ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేసే ఆపరేటర్లకు రూ.7 చొప్పున ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ.. దరఖాస్తుల ఆన్లైన్ ముగిసి నెల కావస్తున్నా ఆపరేటర్లకు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం చెల్లించలేదు. ఆరు రోజుల్లోనే జిల్లాలోని దరఖాస్తులన్నింటినీ ఆన్లైన్ చేయడంతో రాష్ట్రంలోనే రికార్డు నమోదైంది. 1,350 మంది ఆపరేటర్లు పని చేయగా వారిలో కొద్దిమంది మాత్రమే ప్రైవేట్ వారు ఉన్నట్లు తెలిసింది. మిగిలిన వారంతా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. డే వన్ నుంచి మూడు షిఫ్ట్ల్లో రేయింబవళ్లు ఆన్లైన్ చేయగా వారికి సుమారు రూ.32లక్షలు రావాల్సి ఉన్నది.
గత నెల 11న ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కాగా, దాదాపు నెల రోజులు కావస్తున్నప్పటికి ఉరుకులు, పరుగులపై పనిచేయించిన అధికారులు ఆపరేటర్లకు ఇవ్వాల్సిన డబ్బులపై స్పందించడం లేదు. ఇదిలా ఉంటే ప్రజాపాలన కార్యక్రమం కోసం తీసిన జీఓ ప్రకారం గ్రామ పంచాయతీకి రూ.10వేలతోపాటు స్పెషల్ ఆఫీసర్లకు వాహన అలవెన్సులు ఇస్తామన్నారు. పంచాయతీలకు రూ.10 వేలు ఇవ్వగా.. టెంట్లు, భోజనాలు, మైక్సెట్ తదితరాలకు రూ.25వేల వరకు అయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో సర్పంచులు, కింది స్థాయి అధికారులు వాటిని భరించారు. వాహనాల అలవెన్స్లు, పంచాయతీల్లో దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా అయిన వ్యయం ఏమో కానీ తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని డాటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.