హైదరాబాద్ : ముస్లింల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా హోం మంత్రి శుక్రవారం నాడు చండూరు, కోయలగూడెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. చండూరు మండల కేంద్రంలోని జామియా మసీద్లో శుక్రవారం నాటి ప్రార్థనల అనంతరం హోం మంత్రి స్థానిక ముస్లిం సోదరులతో మాట్లాడారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ముస్లింల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం విశిష్టమైన పథకాలను అమలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సెక్యులర్ నాయకుడని, ముస్లింలలో విద్యను విప్లవాత్మకమైన మార్పును తెచ్చేందుకు కేసీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను నెలకొల్పారని వివరించారు. లక్షన్నర మంది ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిందన్నారు. ఈ ఎనిమిదేళ్లలో ముస్లింలు అనేక రంగాల్లో ఎంతో అభివృద్ధిని, ప్రయోజనాలను పొందారన్నారు. దేశంలోనే తొలిసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇమామ్లకు నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తుందని తెలిపారు.
ముస్లింలతో మాట్లాడిన హోంమంత్రి.. తెలంగాణ ప్రభుత్వం షాదీముబారక్ పథకం కింద నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్షా నూట పదహారు రూపాయలను అందజేస్తోందని, పేద తల్లిదండ్రులకు ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయడం జరుగుతుందన్నారు. ఆసరా పింఛన్ గురించి మాట్లాడుతూ.. ‘2014 సంవత్సరానికి ముందు రాష్ట్రంలో ఉపకార వేతనాల పేరుతో కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే అందించేవారు. కానీ తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి నిరంతరంగా పెంచుతూ వస్తున్నాం. ఉపకార వేతనాలను తెలంగాణ ప్రభుత్వం వృద్ధాప్య, వితంతువులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.2016, అంగవైకల్యం ఉన్న వారికి రూ.3016 చొప్పున అందజేస్తోంది. నెలవారీ భృతి కూడా ఇస్తున్నాం. తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలోనూ ఒంటరి మహిళలకు ఉపకార వేతనం ఇవ్వడం లేదు’ అని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ సరఫరా, స్వచ్ఛమైన తాగు నీరు, ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్, సివిల్ సర్వీస్ల ఉచిత కోచింగ్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు తదితర పథకాల ద్వారా ప్రజలలో తెలంగాణ ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ వెంటనే పూర్తి చేస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హోంమంత్రి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
చండూర్ మార్కెట్లో ప్రచారం చేస్తూ ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చండూరులోని పలు ప్రాంతాల్లో కాలినడకన పర్యటించి ఓటర్లను కలుసుకున్న మంత్రి.. టీఆర్ఎస్కు అనుకూలంగా ఓట్లు అభ్యర్థిస్తూ అభ్యర్థి కె.ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం సాయంత్రం చౌటుప్పల్ మండలం కోయిల గూడెం లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంఎల్ఏ బాల్క సుమన్, చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, షరీఫుద్దీన్, సయ్యద్ మునీరుద్దీన్, ఫరీద్, జహంగీర్, రబ్బానీ, సయ్యద్ ఎజాజ్, అబ్దుల్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.