కృష్ణానది చెంతనే ఉన్నా దశాబ్దాల తరబడి పాలకవీడు ప్రాంత ప్రజలు తాగు, సాగునీటికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. పేరుకు జాన్పహాడ్ మేజర్ అయినా గత ప్రభుత్వాల హయాంలో ఎప్పడూ సాగునీరు అందక పంటలు ఎండే పరిస్థితి ఉండేది. కింది నుంచి గలగలా పారే కృష్ణానదిని చూస్తూ ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఆయా గ్రామాల రైతులు చేసేదేమీ లేక మెట్ట పంటలు వేసుకునే దుస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి వనరులపై దృష్టి సారించి అనేక నిర్మాణాలు చేపట్టింది. ఈ క్రమంలో హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గిలిచిన వెంటనే ప్రభుత్వం తాగు, సాగు నీటిపై దృష్టి సారించింది. నియోజకవర్గ వ్యాప్తంగా రిటైర్ట్ ఇంజినీర్ల బృందాన్ని తీసుకొచ్చి చెక్డ్యామ్లు, లిఫ్ట్లపై సమగ్ర సర్వే జరిపించింది. దీనికితోడు సీఎం కేసీఆర్ హజూర్నగర్లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ లిఫ్ట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చొరవతో జాన్పహాడ్ లిఫ్ట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.170 కోట్లు మంజూరు చేశారు.
మండలంలోని గుండెబోయినగూడెం – నర్లింగులగూడెం గ్రామాల మధ్య కృష్ణా నదిపై పడవ రేవు ప్రాంతంలో చేపట్టిన జాన్పహాడ్ బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ పాలకవీడు మండల రైతులకు వరపద్రాయనిగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం 170 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే వానకాలం సీజన్లో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు పనులు ముమ్మరంగా చేయిస్తున్నారు. ఇది పూర్తయి అందుబాటులోకి వస్తే 2వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఉన్నది.
2వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం జాన్పహాడ్ లిఫ్ట్తో పాలకవీడు మండలంలో చివరి గ్రామాలైన గుండెబోయినగూడెం, నర్లింగులగూడెం, జాన్పహాడ్తోపాటు బొత్తలపాలెం, అలింగాపురం, కోమటికుంట గ్రామాల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ లిఫ్ట్ ద్వారా పాలకవీడు మండలంలోని పలు గ్రామాల్లో 5,650 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందులో 2,100 ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరుగనుందని, 3,450 ఎకరాల పాత ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డిస్ట్రిబ్యూటర్ కెనాల్- 1 పరిధి జాన్పహాడ్ గ్రామ శివారులో 650 ఎకరాల్లో నూతన ఆయకట్టు, డిస్ట్రిబ్యూటర్ కెనాల్-3 పరిధి అలింగాపురం, రాఘవాపురం గ్రామాల్లో 1,450 ఎకరాల్లో కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది. డిస్ట్రిబ్యూటర్ కెనాల్-2 పాత ఆయకట్టు గ్రామాలైన బొత్తలపాలెం, కోమటికుంట, హన్మయ్యగూడెం, జాన్పహాడ్, చెర్వుతండా, గుండ్లపహాడ్, నర్లింగులగూడెం గ్రామాల్లో 3వేల ఎకరాలకు పైగా ఎత్తిపోతల ద్వారా సాగు నీరు అందించేందుకు అవకాశం ఉన్నది.
గుండెబోయినగూడెం గ్రామ శివారులో పడవ రేవు వద్ద సర్వే నంబర్ 65, 66లో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. లిఫ్ట్ పంప్హౌజ్ ఏర్పాటకు ప్రస్తుతం సుమారు 500 మీటర్ల లోతుకు పైగా మట్టి ఎత్తివేత పనులు పక్క పక్కనే రెండు ప్రదేశాల్లో వేగంగా జరుగుతున్నాయి. దీనికితోడు పైప్లైన్ తవ్వకం పనులకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు పంటలు సాగు చేస్తున్నందున పైప్లైన్ పనులకు ఆటంకం ఏర్పడిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. మేఘా సంస్థ్ధ నిర్వహిస్తున్న ఈ లిఫ్ట్ కాళేశ్వరం తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా నిలువనుంది.
తలాపునే కృష్ణా నది ఉన్నా.. గుండెబోయినగూడెం, నర్లింగులగూడెం, మహంకాళీగూడెం, రావిపహాడ్, జాన్పహాడ్, కోమటికుంట, పలు తండాల రైతులు, ప్రజలు నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అడిగిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెబోయినగూడెం – నర్లింగులగూడెం గ్రామాల మధ్య కృష్ణా నదిపై లిఫ్ట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం సంతోషకరం. దీంతో దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న ఈ ప్రాంత వాసుల కల నెరవేరినట్లయింది. పనులు పూర్తయి ఈ లిఫ్ట్ అందుబాటులోకి వస్తే పాలకవీడు మండలంలో వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ప్రాంత ప్రజలం ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– దర్గారావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, పాలకవీడు