నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి6(నమస్తే తెలంగాణ) ;కృషానదీ జలాలపై పెత్తనాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డ కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ సమర శంఖం పూరించింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రాజెక్టులను కాపాడుకునేందుకు కృష్ణపట్టె రైతులతో కలిసి గర్జనకు సిద్ధమవుతున్నది. అందుకు వేదికగా నల్లగొండను ఎంచుకున్నది. ఈ నెల 13న నల్లగొండ కేంద్రంగా భారీ బహిరంగ సభను తలపెట్టింది. ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యతిరేక ధోరణిని ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.
నీళ్లు-నిధులు-నియామకాలు నినాదంతోనే సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కృష్ణా జలాల సాధనకు నడుం బిగించారు. 2004లోనే సాగర్ ఎడమ కాల్వ నీటి హక్కుల కోసం కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్రతో పోరు సైరన్ మోగించారు. అక్కడి నుంచి ఇటీవల బీఆర్ఎస్ సర్కార్ ఉన్నంత వరకు కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం నిరంతరం ప్రయత్నించారు. రాష్ర్టాన్ని సాధించి కేసీఆర్ సీఎం అయ్యాక నీటి వాటాలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ కృష్ణపట్టె రైతుల ప్రయోజనాలను కాపాడారు. శ్రీశైలంతోపాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి వాటాను వినియోగంచుకోవడంలో ఎన్నడూ రాజీ పడలేదు.
అందుకే పదేండ్లలో 18 సార్లు సాగర్ ఆయకట్టుకు సాగునీటిని అందించి కొత్త చరిత్ర లిఖించారు. టెయిల్ఎండ్ భూములకు సైతం సాగునీరు అందేలా చర్యలు చేపట్టి ఆయకట్టు రైతుల మన్ననలను పొందారు.శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద మొదలైన మర్నాడే విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆ నీటిని సాగర్కు తరలించి నిల్వ చేస్తూ వచ్చారు. దాంతో సాగర్ ఆయకట్టుకు సైతం సకాలంలో సాగునీటి విడుదలకు ఆస్కారం కలిగేది. ఒక్కోసారి శ్రీశైలం పూర్తిగా నిండి గేట్లు ఎత్తే సరికి విద్యుత్ ఉత్పత్తి ద్వారా సుమారు 30 అడుగుల నీటిని సాగర్కు తరలించిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ అధికారాలతో సాధ్యమైంది.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఈ రెండు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) అప్పగిస్తూ గత నెల 17న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. దాంతో ఒక్కసారిగా ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. తిరిగి సమైక్య రాష్ట్రంలోని పరిస్థితులే తలెత్తుతాయన్న ఆందోళన నెలకొంది. మరోసారి రైతులకు అండగా నిలిచేందుకు ఆది నుంచి కృష్ణా జలాల్లో నీటి వాటా కోసం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నడుం బిగిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 13న నల్లగొండ గడ్డ మీదినుంచి కాంగ్రెస్ సర్కార్పై సమర శంఖం పూరిస్తున్నారు.
నల్లగొండలో భారీ బహిరంగ సభ
తెలంగాణ భవన్లో కృష్ణానదీ పరివాహక ప్రాంత జిల్లాలైన నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ముఖ్యులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంతో తలెత్తే సమస్యలపై చర్చించారు. కృష్ణా జలాల పంపిణీ పూర్తికాక ముందే కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టులను అప్పగించడాన్ని తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఈ నెల 13న మధ్యాహ్నం 2 గంటలకు నల్లగొండ జిల్లా కేంద్రంలో సభను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సభకు కృష్ణపట్టె ప్రాంతంలోని రైతాంగం యావత్ తరలిరావాలని పిలుపునిచ్చారు. దాంతో నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం, రంగారెడ్డి తదితర జిల్లాల నుంచి పెద్దఎత్తున రైతులు తరలివచ్చేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధం అవుతుంది. భారీ బహిరంగ సభ ద్వారా ఇటు కాంగ్రెస్ సర్కారుతో పాటు అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేయాలని భావిస్తున్నారు. కృష్ణా నదిలో తెలంగాణ హక్కులను వదలుకోబోమని, నీటి వాటాలు, ఇతర విషయాలు తేలే వరకు ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి పోకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ ఈ సభ ద్వారా చాటి చెప్పనున్నది.