సూర్యాపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే వారికి పుష్కలంగా మొక్కలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోగా ఇప్పుడు జిల్లాలోనే 2.50 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. రెండు నర్సరీల్లో మొత్తం 5.60 లక్షల మొక్కలు పెరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 2,300 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కాగా ఈ ఏడాది 10 వేల ఎకరాలకు పెంచే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సూర్యాపేట, ఆగస్టు 1 : అయిల్పామ్ సాగుకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలోని రెండు నర్సరీల్లో దాదాపు 5.60 లక్షల మొక్కలు పెంపకం చేపట్టగా 2.50 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 50 వేల మొక్కలను రైతులకు అందించారు. నవంబర్ నాటికి మరో 2.5 లక్షల మొక్కలు అందుబాటులోకి రానున్నాయి. దాంతో ఈ ఏడాది దాదాపు 10 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్షంగా అధికారులు సిద్ధమౌతున్నారు. ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి తెచ్చుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మనమే మన జిల్లా రైతుల కోసం ఆయిల్పామ్ మొక్కలను అందించే స్థితికి ఎదిగాం. రాష్ట్రంలోనే జిల్లా నర్సరీల్లో నంబర్ వన్ క్వాలిటీ మొక్కలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆయిల్పామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు వచ్చినా మొక్కల లభ్యత అడ్డుగా మారింది. జిల్లాలో నర్సరీలు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట నుంచి అక్కడ లేకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మొక్కలను కొనుగోలు చేసి తీసుకువచ్చేవారు. దాంతో డిమాండ్ మేరకు సాగు విస్తీర్ణానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్య పరిష్కారానికి జిల్లాలో రెండు పెద్ద నర్సరీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. సూర్యాపేట జిల్లాలో పతంజలి సంస్థకు ప్రభుత్వ భాగస్వామ్యంతో మొక్కలు పెంచేందుకు, నర్సరీల ఏర్పాటుకు అనుమతించింది. దాదాపు 10 లక్షల మొక్కలను ఒకేసారి పెంచేలా నర్సరీలను ఏర్పాటు చేసింది.
63 ఎకరాల్లో రెండు నర్సరీలను తయారు చేశారు. మునగాల మండలం మాదవరంలో 26 ఎకరాల్లో 4.5 లక్షల మొక్కలు పెంచే సామర్థ్యంతో ఒకటి కాగా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో 37 ఎకరాల్లో 6 లక్షల మొక్కలు పెంచే సామర్థ్యంతో మరో నర్సరీని ఏర్పాటు చేశారు. ఈ రెండు నర్సరీల్లో 10.5 లక్షల మొక్కలు ఒక ఏడాదికి పెంచేలా తయారు చేశారు. గత ఏడాది ప్రారంభమైన ఈ నర్సరీల్లో తొలి ఏడాది 5.60 లక్షల మొక్కలు పెంచడం జరిగింది. మాదవరం నర్సరీలో 2.5 లక్షల మొక్కలు సిద్ధమయ్యాయి. దాదాపు 6 నుంచి 8 ఫీట్ల ఎత్తులో మొక్కలు పెరుగడం జరిగింది.
10 వేల ఎకరాల సాగు లక్ష్యం..
జిల్లాలో కేవలం 2,300 ఎకరాల్లో మాత్రమే రైతులు ఆయిల్పామ్ సాగు చేయడం జరిగింది. దీనిని ఈ ఏడాది పది వేల ఎకరాలకు తీసుకురావాలనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికయుతంగా వెళ్తున్నది. ఇప్పటికే రెండు నర్సరీల్లో దాదాపు 5.60 లక్షల మొక్కల పెంపకం చేపట్టారు. తొలి విడుతలో దాదాపు 3 లక్షల మొక్కలు రాగా వాటిని రైతులకు అందించేందుకు సిద్ధ్దమయ్యారు. ఇప్పటికే దాదాపు 50 వేల మొక్కలు రైతులకు అందించారు. మరో 2.50 లక్షల మొక్కల సిద్ధంగా ఉండగా జిల్లా వ్యాప్తంగా 411 మంది రైతులు 1,821 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు కోసం ఆయిల్పామ్ యాప్లో రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. వీరందరికీ ఆయిల్పామ్ మొక్కలు అందించనున్నారు. ఈ వానకాలం సీజన్ అక్టోబర్ నాటికి దాదాపు 3 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటించనున్నారు. నవంబర్ నాటికి మరో 2.50 లక్షల మొక్కలు సైతం అందుబాటులోకి రానున్నాయి. దశల వారీగా జిల్లాలో ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు పెరుగనున్నది.
ప్రభుత్వ ప్రోత్సాహం..
రాష్ట్రంలో ఎకరాకు ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు మరింత ప్రోత్సాహం అందిస్తున్నది. పూర్తి సబ్సిడీపై డ్రిప్ అందజేయడంతో పాటు ఆయిల్పామ్ సాగు వేసిన నాటి నుంచి మూడేండ్ల పాటు ఎరువుల కోసం ప్రతి ఏటా నగదును ఇవ్వనున్నది. దానికి తోడు రైతు ఉపాధి హామీ కూలీ అయితే సాగు సమయంలో కొంత మేర నగదు అందనున్నది. ప్రభుత్వ ప్రోత్సాహం, అవగాహనతో వంద ఎకరాల్లో ఉన్న ఆయిల్పామ్ తోటల సాగు ప్రస్తుతం 2,300 ఎకరాలకు పెరిగింది.