నీలగిరి, మార్చి 26 : అంగన్వాడీ కేంద్రాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించి చిన్నారులు అక్షరాలను గుర్తుపట్టేలా తీర్చిదిద్దాలని నల్లగొండ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ ఆలీ అన్నారు. గురువారం పట్టణంలోని 46వ వార్డు పరిధిలోని రాజ్నగర్ అంగన్వాడీ కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఏ ఎల్ ఎం సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తుందని తెలిపారు. చిన్నారులు పౌష్టికారంతో పాటు ఆటపాటలతో అక్షరాలను గుర్తుపట్టేలా వారి మేధాశక్తిని పెంపొందించాలని సూచించారు. గర్భిణీలు, చిన్నారులకు రక్తహీనత సమస్య రాకుండా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికారాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అదేవిధంగా చిన్నారులకు ప్రీస్కూల్ కార్యక్రమాల నిర్వహణతో పాటు కథలు ఇతర విషయాలు ఆసక్తి కలిగేలా చొరవ తీసుకోవాలన్నారు. చిన్నారుల భవిష్యత్కు అంగన్వాడీ కేంద్రాలు పునాదులుగా ఉండాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని వెంటనే దాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం డిప్యూటీ మేయర్ ను వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయమ్మ, అంగన్వాడీ టీచర్లు రాజవిలోచన, శ్రీదేవి, ఆయేషా, ఫరీదా, ఆశా వర్కర్ జ్యోతి, చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.