పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. సర్కారు స్కూళ్ల విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నది. ఈ సమయంలో విద్యార్థులు చదువులో నిమగ్నమై ఒత్తిడికి గురికాకుండా పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందిస్తున్నది. ఉడికించిన శనగలు, అరటిపండు, అటుకుల చుడువా, పల్లీలు, బెల్లం, ఉడికించిన గుడ్లు, సమోసాలు, పకోడీ, బిస్కెట్ ప్యాకెట్ ప్రతిరోజూ సాయంత్రం మెనూ ప్రకారం ఇస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు ప్రభుత్వం 15 రూపాయలు వెచ్చిస్తున్నది. ఈ నెల 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏప్రిల్ 1 వరకు సెలవులు పోగా 34 రోజులపాటు కొనసాగనున్నది.
– సూర్యాపేట, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం ప్రభుత్వ ఆదేశంతో విద్యాశాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. జిల్లాలో అక్టోబర్ నుంచే పది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాసులు తీసుకుంటూ, వారాంతంలో స్లిప్ టెస్ట్లు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతుండగా వెనువెంటనే రెండో ప్రీ ఫైనల్ టెస్ట్లు కూడా నిర్వహించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా స్నాక్స్ అందిస్తుంది. సాయంత్రం పాఠశాల సమయం తర్వాత స్పెషల్ క్లాసులకు ముందు ఆయా రోజుల్లో మెనూ ప్రకారం అరటి పండు, ఉడికించిన శనగలు, సమోసా తదితరాలను అందిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసింది. విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెడుతుంది. అధునాతన బోధన పద్ధతులను అవలంభిస్తూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చి దిద్దేందుకు అన్ని రకాలుగా చర్యలు చేపట్టింది. ఎనాడో నిర్మించిన భవనాలను మన ఊరు-మన బడి పేరిట వందల కోట్లు వెచ్చిస్తూ భవనాలను ఆధునికీకరణ చేస్తుంది. మెరుగైన ఫలితాల కోసం పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంది. సాయంత్రం విద్యార్థులు ఆకలితో ఉండకుండా ఉండేందుకు విద్యార్థులకు స్నాక్స్ అందిస్తుంది.
రోజు మెనూ..
సోమవారం ఉడికించిన మంచి శనగలు, అరటిపండు, మంగళవారం అటుకుల చుడువా, అరటిపండు, బుధవారం వేయించిన పల్లీలు, బెల్లం, అరటిపండు, గురువారం రెండు ఉడికించిన గుడ్లు, అరటిపండు, శుక్రవారం రెండు సమోసాలు లేదా పకోడి లేదా బిస్కెట్ ప్యాకెట్, అరటిపండు, శనివారం ఉడికించిన పల్లీలు, అరటిపండు అందిస్తున్నారు. జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ల్లో చదివే 4,141 మంది విద్యార్థులతో పాటు కేజీబీవీలో 608, మైనారిటీ వెల్ఫేర్-246, మోడల్ స్కూల్-808, గురుకులాలు ఇతర పాఠశాలల్లో 1,899 మొత్తం 7,702 మంది విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్నాక్స్ ఇవ్వడం సంతోషంగా ఉంది
సాయంత్రం సమయంలో స్నాక్స్ ఇవ్వడం సంతోషంగా ఉంది. మధ్యాహ్నం భోజనంతో పాటు పుస్తకాలు ప్రభుత్వమే అందిస్తున్నది. విశాలమైన క్లాస్ రూంలు మంచి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు నాకు గర్వంగా ఉంది. మంచి ర్యాంకు సాధించి పాఠశాలకు పేరు తీసుకొస్తాను.
– చేకూరి ప్రసాద్, బాయ్స్ హైస్కూల్ కోదాడ
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
సాయంత్రం చదువుకుంటున్న సమయంలో మాకు అల్పాహారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అల్హాహారంలో శనగలు, పల్లీలు, తాజా పండ్లను అందిస్తున్నారు. వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తాను.
– పి.రాజేశ్, జడ్పీహెచ్ఎస్, నడిగూడెం
మెనూ పాటించాలి
ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల కోసం అందిస్తున్న స్నాక్స్ను మెనూ ప్రకారం అందించాలి. పరీక్షా సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న దృష్ట్యా సాయంత్రం వేళ వారు ఆకలి తీర్చుకునేందుకు స్నాక్స్ అందించడం జరుగుతుంది. ఎక్కడైనా స్నాక్స్ అందించకుంటే చర్యలు తప్పవు.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట